హన్మకొండ: వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నందుకు నిరసిస్తూ సోమవారం హనుమకొండ కాళోజీ కూడలిలోని వరంగల్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వరంగల్ కలెక్టరేట్కు వద్దకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు గేట్ మూసివేశారు. దీంతో గేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు ఇతర నాయకులను పోలీసులు పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వినయ్భాస్కర్తో పాటు, పార్టీ నాయకులను సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం వదిలిపెట్టారు. ఈసందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాయకులు కమరున్నీసా బేగం, మిడిదొడ్డి స్వప్న, మర్రి యాదవరెడ్డి, నయీముద్దీన్, జోరిక రమేశ్, రామ్మూర్తి, బైరపాక ప్రశాంత్, బొల్లు సందీప్తో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి ఎగవేతపై ధర్నా
కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం


