● నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామంలో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
● వర్ధన్నపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి, నెక్కొండలో అధిక తేమ
సాక్షి, వరంగల్: వర్షాలు కురవాల్సిన సమయంలో జిల్లాలో సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవిని తలపించేలా జూలైలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గిపోవడం, ఆకాశం మేఘావృతమైన పరిస్థితులు లేకపోవడంతో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణ విభాగ గణాంకాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలోని చాలా మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ముఖ్యంగా నల్లబెల్లి మండలంలోని మేడపల్లిలో అత్యధికంగా 37.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగెం మండలంలో 37 డిగ్రీలు, గీసుకొండ, నర్సంపేట, ఖానా పురం, చెన్నారావుపేట, నెక్కొండ, పర్వతగిరి, దుగ్గొండి మండలాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆ ప్రాంతాల్లో
ఉక్కపోత ఎక్కువ..
జిల్లాలోని చాలా మండలాల్లో గరిష్టంగా తేమ 70 నుంచి 90 శాతం మధ్య నమోదైంది. వర్ధన్నపేట, ఖానాపురం, నల్లబెల్లి, రాయపర్తి, నెక్కొండలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత తీవ్రంగా ఉంది. బుధవారం మధ్యాహ్నం ఎండ తీవ్రతకు తేమ కూడా తోడవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
వానలు కురవక పెరిగిన వేడి
జిల్లాలో వారం రోజులుగా విస్తృతంగా వర్షాలు కురవకపోవడం, మేఘాలు చెదిరిపోవడం, సూర్యరశ్మి తీవ్రంగా ఉండడంతో భూమి వేడెక్కుతోంది. ఉద యం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత కూడా అధికమైంది.


