ఒప్పందం కుదుర్చుకుంటున్నాం..
● పాకాలలో నిరుపయోగంగా కాటేజీలు
● ఐదు నెలల నుంచి నిర్వహణ బంద్
● ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు
● పట్టించుకోని అటవీశాఖ అధికారులు
ఖానాపురం: పాకాల పర్యాటక ప్రాంతంలోని కాటేజీలు మూలనపడ్డాయి.. పర్యాటకశాఖ నుంచి అటవీశాఖ పరిధిలోకి వచ్చినా వాటి పరిస్థితి మాత్రం మారడం లేదు.. రాత్రి, ఉదయం సమయాల్లో బస చేయడానికి కాటేజీలు అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీశాఖ పరిధిలో ఉన్న కాటేజీలను ఆధునికీకరిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో రావడంతోపాటు పర్యాటకులకు వసతి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కరోనా సమయంలో రెస్టారెంట్ మూసివేత..
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పాకాల ఒకటి. పాకాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ ఏడు కాటేజీలు, రెస్టారెంట్ నిర్మాణం చేపట్టింది. దీంతో పాకాలకు పర్యాటకుల సంఖ్య పెరిగి కాటేజీల నిర్వహణ సాగింది. ఆ తర్వాత కరోనా సమయంలో రెస్టారెంట్ మూతపడిపోయింది. కాటేజీల నిర్వహణ మాత్రం కొనసాగుతూ వచ్చింది. కాటేజీలు, బోటింగ్ పర్యాటకశాఖ పరిధిలో ఉండగా.. బోటింగ్ అటవీశాఖ పరిధిలోకి వెవెళ్లడంతో ఆదాయం తగ్గిపోయింది. దీంతో కాటేజీలను సైతం 2026 ఫిబ్రవరి 17న అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నాటి నుంచి కాటేజీల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. పాకాలకు వచ్చే పర్యాటకులు బసచేయడానికి ఉన్న కాటేజీలు కాస్త అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాకాల కాటేజీలు అటవీ శాఖ ఆధీనంలోకి వచ్చిన విషయం వాస్తవమే. కాటేజీల నిర్వహణ, ఆధునికీకరణకు సంబంధించిన విషయంపై ఎఫ్డీసీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఇటీవల ఎఫ్డీసీ నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి అంచనాలు తీసుకెళ్లారు. ఎఫ్డీసీ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో అందుబాటులోకి తీసుకొవస్తాం. నిర్వహణ కోసం ఇప్పటికే ఆరుగురికి శిక్షణ సైతం ఇప్పించాం
– నరేశ్ బసవ, ఎఫ్ఆర్వో, నర్సంపేట


