జీవితకాల గౌరవ వేతనం ఇచ్చేలా చూడాలి
విజయనగరం టౌన్:
సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశాలన్నింటినీ క్రోడీకరించి, వాటిని తనదైన శైలిలో రూపు మాపేందుకు కలంపట్టి కన్యాశుల్కం వంటి అద్భుతమైన నాటకాన్ని మహాకవి గురజాడ రచించి, అసమానతలను రూపు మాపేందుకు కృషి చేసి, విమర్శకుల నోట వెంట శభాష్ అనిపించుకున్నారు. అటువంటి మహనీయునికి ఉన్న చిన్నపాటి స్వగృహం రక్షించుకోవడంలోనూ, వారి వారసత్వాన్ని కొనసాగించడంలో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నడం చరిత్రలో ఓ కళంకంగా నిలిచిపోతుందని సాహితీవేత్తలు ధ్వజమెత్తుతున్నారు. మహాకవి గురజాడ సమాజంలో రుగ్మతలను రూపుమాపేందుకు కన్యాశుల్కం పేరుతో 1892 ఆగస్టు 13న తొలి కూర్పును ప్రదర్శించారు. 1897లో ఆనందగజపతి రాజుకి అంకితం ఇచ్చారని చరిత్రలో చెప్పుకుంటూ వస్తున్నారు. అటువంటి కూటమి ప్రభుత్వంలో విజయనగరం రాజుల కుటుంబీకులే ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తుండడం పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం వెళ్లగక్కుతున్నారు. మహాకవి కుటుంబం చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 2015 నుంచి నెలకు రూ.10 వేలు క్రమం తప్పకుండా పంపిస్తున్నారు. అది తీసుకోవడం కూడా ఇబ్బందిగానే ఉందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రచయిత్రుల సమావేశానికి హాజరైన యార్ల గడ్డ సభాముఖంగా ఎమ్మెల్యే అతిధికి సమస్యను వివరించిన సంగతి విదితమే. మీ మహారాజులకు సేవ చేసిన మహాకవి కుటుంబానికి ట్రస్ట్ నుంచి రూ. 25 వేలు నెలకు అందే విధంగా చూడాలని కోరారు.
1989లో మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని ఆయన కుటుంబీకులు దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వపరం చేశా రు. నాటి నుంచి ఆ గృహాన్ని సంరక్షించే బాధ్యతల ను కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నిర్వహిస్తూ ఉండేవారు. 2011లో గురజాడ మునిమనవడు వెంకటేశ్వరప్రసాద్కి ఎటువంటి జీవనాధారం లేదని నెలకు రూ.20వేల జీతంతో అందులో అవుట్ సోర్సింగ్ విధానంలో అవకాశమిచ్చారు. ఆయనకు 50 ఏళ్ల వయసున్నప్పుడు అవకాశమిచ్చి ప్రస్తుతం 62 ఏళ్లు అయిపోయిందని కల్చరల్ డిపార్ట్మెంట్ అధికారులు గతేడాది నుంచి తీసివేశారు. ఈ ఏడాది మార్చి నెలలో విజయవాడ వచ్చి జీతాలు ఎందుకు రావడం లేదని కుటుంబ సభ్యులు ఆరా తీస్తే ఉద్యో గం నుంచి తీసివేసినట్లు చెప్పడం బాధాకరమని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మహాకవి ఇంటికి తమ చేతి డబ్బులు పెట్టించి పనులు చేసుకోవాల్సి వస్తుందని గురజాడ ముని మనవరాలు ఇందిర ఆవేదన వెళ్లగక్కారు. 2011లో గురజాడ గృహాన్ని సంరక్షించే బాధ్యతను జీఓ ప్రకారమే ఇచ్చినప్పటికీ గతేడాది సెప్టెంబర్ నుంచి అతన్ని విధుల్లోంచి తొలగిస్తూ రిటైర్ అయిపోయారని అక్కడకు వెళితే గానీ చెప్పలేదని వాపోయారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు, మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ను, మంత్రి కొండపల్లి శ్రీనివాస్లకు వినతులిచ్చినా పక్కన పడేయడం విచాకరమని ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు వినతులిచ్చాం. ఎటువంటి నోటీసు లేకుండా విధుల్లోంచి తీసేశారు. జీవిత కాల గౌరవవేతనం ఇచ్చి గురజాడను బతికించండి. పక్క రాష్ట్రాల్లో ప్రసిద్ధ కవులు, కళాకారుల కుటుంబాలకు ప్రభుత్వమే ఆర్థిక సాయ మందిస్తోంది. అటువంటిది మహాకవి కుటుంబం పట్ల ఇంతటి చిన్నచూపు చూడడం తగదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలి. తమకు న్యాయం చేయాలి.
–గురజాడ వెంకటేశ్వరప్రసాద్, గురజాడ ముని మనవడు, విజయనగరం


