ఇదెక్కడి న్యాయం?
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చింతలబెలగాం గ్రామానికి చెందిన బెలగాం పారమ్మ అనే వృద్ధురాలు గురువారం చనిపోయింది. ఈ మేరకు మృతదేహాన్ని స్థానిక గుడి చెరువులో దళితులకు అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో కప్పిపెట్టారు. అయితే ఆ చెరువును ఆక్రమించిన రైతులు మృతురాలి కుటుంబ సభ్యులపై శుక్రవారం చినమేరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను మృతదేహాన్ని బయటకు తీయందే తాము ఒప్పుకోమని రైతులు డిమాండ్ చేశారని దళితులు తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్కు ఫోన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికీ వారు అందుబాటులో లేరన్నారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు.


