పెదగంట్యాడ: యారాడ తీరంలో సముద్రంలో దిగిన ఓ మహిళ కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్గార్డ్స్ కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరంలోని రైల్యే న్యూ కాలనీకి చెందిన సూర్యలక్ష్మి(55) అనే మహిళతో మరో నలుగురు కుటుంబ సభ్యులతో కలసి యారాడ తీరంలో సరదాగా గడిపేందుకు ఆదివారం ఉదయం వచ్చారు. అక్కడ కాసేపు ఇసుక తిన్నెల్లో గడిపి, అనంతరం ఐదుగురూ సముద్రంలో దిగారు. ఒక్కసారిగా అలల తాకిడి ఎక్కువ కావడంతో అందులో సూర్యలక్ష్మి సముద్రంలోకి కొట్టుపోతుండగా.. అక్కడే ఉన్న లైఫ్గార్డ్స్ కదిరి లోవరాజు, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీనివాస్, కదిరి వెంకటేష్ గమనించారు. వెంటనే వారు సముద్రంలో దిగారు. కొట్టుకుపోతున్న సూర్యలక్ష్మిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకొని ఆమెను రక్షించిన లైఫ్గార్డ్స్కు కృతజ్ఞతలు తెలిపారు.


