పీఎం పాలెం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలు... విజయనగం జిల్లా మెంటాడ మండలానికి చెందిన గండి కామునాయుడు(41) బతుకు తెరువుకోసం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. క్రికెట్ స్టేడియం వెనుక తులసీనగర్ లే ఔట్లో భార్య వెంకటితో కలిసి నివసిస్తున్నాడు. కుటుంబ పోషణకు పెయింటింగ్ పనులకు వెళుతుంటాడు. అతనికి ఓ కుమార్తె(18), ఓ కుమారుడు(16) ఉన్నారు. కామునాయుడుకు మద్యపానం వ్యసనంతో పాటు పలు ఆరోగ్య సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుని భార్య వెంకటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


