విద్యార్థుల హక్కులను హరించాలని యత్నిస్తే సహించం. విద్యార్థుల ఆగ్రహానికి గురైన ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనుగడ సాగించిన దాఖలాలు లేవు. విద్యార్థి సంఘాలపై ఆంక్షలు విధించడం ద్వారా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు మరింత రెచ్చిపోతాయి. పేద విద్యార్థులు, తల్లిదండ్రులను వేధించి రూ.కోట్లు వసూలు చేసి వ్యాపార సామ్రాజాన్ని విస్తరించి విద్యను వ్యాపారంగా మార్చేస్తాయి.
– అశోక్ కుమార్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షుడు
ప్రశ్నించే గొంతుకలపై ఆంక్షలా..
పేద విద్యార్థులను పీక్కుతింటున్న కార్పొరేట్ సంస్థల ఆగడాలపై ప్రశ్నించడం తప్పా. ప్రభుత్వ పాఠశాలలో, సంక్షేమ వసతిగృహాలలో నాణ్యమైన ఆహారం, మౌఇక వసతులపై ప్రశ్నించే గొంతుకలపై ఆంక్షలు విధిస్తారా. ప్రభుత్వ విద్యా సంస్థలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ పట్టించుకోకపోవడంతో పేదలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే బెదిరింపులు, కేసులు పెడతారా. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
– సుందర్రాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడు
ఉపసంహరించుకోవాలి
లోకేష్ అన్నా అధికారం చేపట్టి మంత్రి పదవితో గతం మరిచిపోయారా.. యువగళం పాదయాత్రలో యువతకు మీరు ఇచ్చిన హామీ గుర్తు లేదా.. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని, విద్యార్థి సంఘాలు సమస్యలపై గళం విప్పాలని ఊదరగొట్టిన ఉపన్యాసాలు ఏమయ్యాయి. విద్యా సంస్థలలోని విద్యార్థి నేతలకు అనుమతి లేదంటూ ఆంక్షలు విధించడం విద్యార్థి హక్కులపై దాడి కాదా..ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. – శివశంకర్ నాయక్, జీఎన్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
రెడ్బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వాలను గతంలో ఎన్నడూ చూడలేదు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తిన విద్యార్థి సంఘాలను విద్యాసంస్థలలోకి అనుమతించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు. తక్షణం ఉపసంహరించుకోకుంటే విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది.
– ఆర్.ఆశ, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి
సమయం ఆసన్నమైంది
చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న రెడ్బుక్ రాజ్యాంగానికి చెక్ పెట్టాలంటే మరో జెన్జెడ్ ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో అంబేడ్కర్ అందించిన రాజ్యాంగానికి చరమగీతం పాడే దుర్మార్గపు పరిస్థితి తలెత్తడం దారుణం, విద్యార్థి సంఘాలు తక్షణం స్పందించాలి. రెడ్బుక్ రాజ్యాంగానికి అడ్డుకట్ట వేయకపోతే పేద విద్యార్థుల మనుగడ అసాధ్యం.
– ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి


