అన్నానగర్ (చెన్నై): యూట్యూబ్ చూసి ఇంట్లో కోడలికి అత్త ప్రసవం చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమై కోడలు మృతి చెందింది. తిరుప్పూర్ జిల్లాలోని ఊత్తుకుళి సమీపంలో ఉన్న పుంజై తలవైపాలైయానికి చెందిన సామి, భార్య శశికళ (32) ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది.
శశికళ మళ్లీ గర్భవతి అయ్యింది. బిడ్డ గర్భం దాల్చిన రోజు నుంచే ఆమె అత్త పళనియత్తాల్ (56) ఆమె కుటుంబం, ఏ వైద్యుడిని సంప్రదించలేదు, టీకాలు కూడా వేయించలేదు. యూట్యూబ్లోని ఓ వీడియో చూసి సహజంగా ప్రసవించాలని కోరుకున్నారు. 40 వారాల గర్భవతిగా ఉన్న శశికళకు ఈనెల 24న ఉదయం 5.40 గంటలకు ప్రసవ వేదన మొదలైంది. అయితే, శశికళను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, ఆమె అత్త ఇంట్లోనే యూట్యూబ్ చూసి ప్రసవం చేసింది. ఆడబిడ్డ పుట్టింది. పాప ఆరోగ్యంగా ఉండగా, శశికళకు తీవ్ర రక్తస్రావమైంది.
దీంతో ఆమెను ఈరోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అధిక రక్తస్రావం కారణంగా వైద్యులు శశికళ గర్భాశయాన్ని తొలగించారు. 65 యూనిట్ల రక్తాన్ని ఎక్కించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో, 25వ తేదీ సాయంత్రం శశికళను కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందించినా, కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందింది.


