
జడ్చర్ల: ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలికి బస్సు డ్రైవర్కు మధ్య గొడవ జరగగా చివరకు పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటు చేసుకుంది.సీఐ కమలాకర్ కథనం మేరకు.. హైదరాబాద్-2 ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కొల్లాపూర్ బయలుదేరింది. జడ్చర్లలోని శ్రీనివాస కాలనీకి చెందిన అనసూయ అనే ప్రభుత్వ ఉద్యోగిని బస్సు ఎక్కింది.
బస్సు ఫుట్బోర్డుపై నిలబడడంతో బ్రేక్ వేస్తే కింద పడిపోయే ప్రమాదముందని డ్రైవర్ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన ఆమె ఒక్కసారిగా డ్రైవర్పై మండిపడింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో బస్సును మార్గమధ్యలోని పోలీస్ స్టేషన్ వద్ద ఆపి పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పోలీసులు ఇద్దరిని విచారించి బస్సును పంపించి వేశారు.