బస్టాండ్‌లో మహిళ ప్రసవం | A woman gives birth at a bus stand | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో మహిళ ప్రసవం

Jun 17 2024 3:28 AM | Updated on Jun 17 2024 3:28 AM

A woman gives birth at a bus stand

పురుడుపోసిన ఆర్టీసీ సిబ్బంది 

ఒడిశాకు చెందిన తల్లీబిడ్డ క్షేమం 

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఘటన

కరీంనగర్‌ టౌన్‌: భర్తతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ నిండు గర్భిణి కరీంనగర్‌ బస్టాండులో ఆదివారం సాయంత్రం పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోశారు. ఒడిశాకు చెందిన కుమారి– దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు.

నిండు గర్భిణి అయిన కుమారిని తీసుకుని ఆమె భర్త దూల ఆదివారం కుంట–భద్రాచలం మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కుమారికి పురిటినొప్పులు వచ్చాయి. కాసేపటికి ఎక్కువ కావడంతో ఆమె భర్త అక్కడే ఉన్న ఆర్టీసీసిబ్బంది సాయం కోరాడు. వారు వెంటనే 108 సిబ్బందికి ఫోన్‌ చేశారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్టీసీ మహిళా సిబ్బంది పరిస్థితిని గమనించి ప్లాట్‌ఫాం ఎదురుగా ఉన్న చెట్టు కిందకు కుమారిని తీసుకెళ్లారు. 

చుట్టూ చీరలు అడ్డుగా పెట్టి డెలివరీ చేశారు. అదే సమయంలో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం అందించారు. పండంటి ఆడబిడ్డ జని్మంచగా.. 108 వాహనంలో తల్లీబిడ్డను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని కుమారి భర్త దూల ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement