నేటి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల మూడోదశ పోరాటం
కలెక్టర్ల ద్వారా సీఎంకు వినతిపత్రాలతో ప్రారంభం
సాక్షి, అమరావతి: విద్యుత్ బస్సుల సాకుతో ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలపై పోరాడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు నేటి (సోమవారం) నుంచి మూడోదశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. జూన్ 12, జూలై 1 తేదీల్లో రెండుదశల్లో ఉద్యమం చేపట్టినప్పటికీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో.. ఆర్టీసీ పరిరక్షణ కోసం తగ్గేదేలేదంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మూడోదశ ఆందోళన చేపడుతున్నారు. గ్రీవెన్స్ డే (పీజీఆర్ఎస్)ని పురష్కరించుకుని సోమవారం అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రికి పంపమని కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.
ఈ నెల 7, 8 తేదీల్లో అన్ని సంఘాలు, రిటైర్డ్, అవుట్ సోర్సింగ్, కార్మిక, విద్యార్థి, యువజన, ప్రభుత్వ ఉద్యోగసంఘాల జేఏసీ నాయకులను కలిసి మద్దతు కోరనున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని డిపోలు, యూనిట్లలో నల్లబ్యాడ్జీలు ధరించి భారీస్థాయిలో సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపడతారు. 28న అన్ని జిల్లాల్లో ప్రజారవాణా అధికారి (డీపీటీవో) కార్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలతో మహాధర్నాలు నిర్వహిస్తారు. సంస్థ పరిరక్షణ, ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం, పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే సెపె్టంబర్ 3వ తేదీ నుంచి నాలుగోదశ ఉద్యమ కార్యాచరణను తీవ్రం చేస్తామని జేఏసీ కన్వినర్లు పలిశెట్టి దామోదరరావు, వై.శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..
» విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ రూ.వేలకోట్ల విలువైన ఆర్టీసీ డిపో స్థలాలను లీజు పేరుతో కట్టబెట్టి దశలవారీగా ప్రైవేట్పరం చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి.
» విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థ ద్వారా కొనుగోలు చేసి నిర్వహించాలి.
» విజయవాడలోని విద్యాధరపురం, గుంటూరు–2, నెల్లూరు–2, మంగళం బస్సు డిపోలను వెంటనే పునఃప్రారంభించాలి.
» స్త్రీశక్తి స్కీం అమలుతో మహిళా ప్రయాణికుల కోసం బస్సులు పెంచాలి.
» ఆర్టీసీలో ఉద్యోగుల ఖాళీలు భర్తీచేయాలి.
» ప్రతి నెల 7వ తేదీలోపు ఆర్టీసీ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలి.
» ఏపీపీటీడీ ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, డ్రైవర్లకు మినిమమ్ టైం స్కేల్ ఇవ్వాలి.
» ఆర్టీసీ ఉద్యోగులకు వీక్లీ ఆఫ్లు, లేబర్ హాలీడేస్, ఫ్యామిలీ హెల్త్కార్డులు ఇవ్వాలి.
» పదేళ్ల సర్వీస్ దాటినవారిని రెగ్యులర్ చేయాలి.


