
ఫిలింనగర్: ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ వివాహితను పరిచయం చేసుకున్న స్పా యజమాని ప్రేమ పేరుతో వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మల్కాజగిరిలోని హనీ స్పా యజమాని విక్కీ విక్రమ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఫిలింనగర్లోని దీన్దయాళ్నగర్ బస్తీకి చెందిన వివాహిత (35) మాదాపూర్లోని ఓ స్పాలో బ్యూటీషియన్గా పనిచేస్తున్నది.
ఇటీవల మరింత మెరుగైన ఉద్యోగం కోసం మల్కాజిగిరిలోని హనీ స్పాలో ఇంటర్వ్యూకు వెళ్లగా స్పా యజమాని విక్కీ విక్రమ్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణ జరుగుతుంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్తకు ఈ విషయం తెలియదని ఆమె చెప్పగా అదంతా తాను చూసుకుంటానని, నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మబలికాడు. దీంతో ఆమె విక్కీ విక్రమ్తో మరింత సన్నిహితంగా మెలిగింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో ఆమె దూరంగా ఉండసాగింది. ఇది భరించలేని విక్రమ్ గురువారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చి బయట నుంచి డోర్ లాక్ చేశాడు. దీంతో ఆమె భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో విక్రమ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తనను శారీరికంగా, మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 75, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.