చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి.. | Warangal Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..

Aug 2 2025 11:04 AM | Updated on Aug 2 2025 11:27 AM

Warangal Wife And Husband Incident

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త 

వివాహేతర సంబంధమే కారణం

ఏనుమాముల బాలాజీనగర్‌లో ఘటన

ఖిలా వరంగల్‌ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్‌ ఏనుమాముల పోలీస్‌ స్టేషన్‌ పరిధి బాలాజీ నగర్‌లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ అలియాస్‌ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్‌ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్‌క్రీమ్‌ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్‌ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్‌ క్రీమ్‌ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్‌ సింగ్‌ ఇద్దరు ఉత్తర్‌ ప్రదేశ్‌ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్‌ సింగ్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్‌కు మార్చాడు. 

మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్‌లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్‌ సింగ్‌ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్‌ సింగ్‌.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా     సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. 

సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్‌పాషా ‡ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ జే.సురేశ్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement