
నస్పూర్/అక్కన్నపేట(హుస్నాబాద్)/జహీరాబాద్ టౌన్: ఇంటర్లో ఫెయిల్ కావడంతో సోమవారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంచిర్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్లోని జయశంకర్ కాలనీలో నివాసం ఉండే కోటేజీ కృష్ణార్జునరావు, ప్రవీణ దంపతుల చిన్న కూతురు అక్షయ సెకండియర్ గణితం ఫెయిల్ కాగా సప్లిమెంటరీ పరీక్ష రాసింది.
సోమవారం వెలువడిన ఫలితాల్లోనూ పాస్ కాకపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ ఫ్యాన్కు ఉరేసుకుంది. తండ్రి గమనించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందింది. మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం దాస్తండా గ్రామానికి చెందిన గుగులోతు కవిత–సూర్యనాయక్ దంపతుల రెండవ కుమార్తె హారిక (17) హనుమకొండ జిల్లా వంగర గురుకులంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
బాటనీ సబ్జెక్ట్లో ఫెయిలైంది. తిరిగి సప్లిమెంటరీ రాసినా పాస్ కాకపోవడంతో సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. రాయికోడ్ మండలం మహబత్పూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ కుమారుడు వెంకటరమణ(18)ఆర్ఎల్ఆర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లోనూ ఒక సబెక్టులో ఫెయిల్ కావడంతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.