విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. చిత్రంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, అజహరుద్దీన్
‘క్యూర్’లో ఎల్ఐజీ ఇళ్లకు నేటి నుంచే దరఖాస్తులు: మంత్రి పొంగులేటి
తొలుత 16 నియోజకవర్గాల్లో 500 చొప్పున ఇళ్ల నిర్మాణం
రూ.5 లక్షల సబ్సిడీ, మిగిలిన రూ.6 లక్షలు 4 వాయిదాల్లో చెల్లించాలి
వచ్చే బోనాల నాటికి లబ్ధిదారులకు ఇళ్లు
మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం, అజహరుద్దీన్లతో కలిసి పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 16 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఈ బోనాల పండగకు ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తొలివిడతలో మొత్తం 7,680 ఇళ్లు నిర్మిస్తామని, వచ్చే బోనాల పండగ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పా రు. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. అపార్ట్మెంట్ల తరహాలో నిర్మించే ఈ ఇళ్లకు స్థలాలు ఎంపికైన నియోజకవర్గాల్లో ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, క్యూర్ పరిధిలోకి వచ్చే మిగతా నియోజకవర్గాల్లో స్థలాలు ఎంపిక కాగానే అక్కడ కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని తెలిపారు. అత్యాధునిక హంగులతో కూడిన హౌసింగ్ టవర్లను నిర్మించి అందులోని ఫ్లాట్లను లబ్ధిదారులకు అందించనున్నారు. సోమవారం సచివాలయంలో సహచర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్తో కలిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల పథకం బ్రోచర్ను, ఇళ్ల నమూనాలను, మీ–సేవ, వాట్సాప్లో దరఖాస్తు విధానాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఎల్ఐజీ ఇళ్లు 525 చ.అ. వైశాల్యంతో..
క్యూర్ పరిధిలోని ఎల్ఐజీ ఇళ్లు 525 చ.అ. వైశాల్యంతో ఉంటాయని, మౌలిక వసతుల ఖర్చు సహా ఒక్కో ఇంటికి సగటున రూ.11 లక్షల వరకు ఖర్చవుతుందని పొంగులేటి తెలిపారు. ఇందులో ప్రభుత్వం సబ్సిడీగా రూ.5 లక్షలు అందించనుండగా, మిగతా రూ.6 లక్షలను నాలుగు వాయిదాల్లో లబ్ధిదారు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇల్లు మంజూరు కాని వారికి ఆ రూ.10 వేలు తిరిగి చెల్లిస్తామన్నారు. నగరంలో భూముల ధరలు రూ. వందల కోట్లలో ఉన్నప్పటికీ, లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఉచితంగా భూమిని అందజేస్తోందని, ఆ అపార్ట్మెంట్ స్థలంలో అన్డివైడెడ్ షేర్, ఇంటి పట్టా ఆ కుటుంబ మహిళ పేరిటే ఉంటుందన్నారు. ఈ ఇళ్లను పదేళ్ల వరకు విక్రయించే హక్కు ఉండదని, బ్యాంకు రుణం కోసం తాకట్టు పెట్టుకునే వెసులుబాటు మాత్రం ఉంటుందన్నారు. ఈ నెల 21 నుంచి మీసేవ, వాట్సాప్ (నంబర్: 8096958096), వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పొంగుటేటి తెలిపారు. ఈ ఇళ్లలో ఒక హాలు, పడగ గది, వంటగది, టాయిలెట్ ఉంటాయన్నారు. త్వరలోనే మధ్యతరగతి వర్గాల ఇళ్ల పథకంపై ప్రకటన ఉంటుందని తెలిపారు. పారదర్శకమైన లాటరీ/ఎంపిక విధానం ద్వారా నిజమైన అర్హులకే ఇళ్లు దక్కుతాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.
అర్హతలివే...
దరఖాస్తుదారులు స్థానికంగా కనీసం 10 సంవత్సరాలుగా నివసిస్తూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు. కుటుంబ సభ్యుల పేరిట ఎక్కడా సొంత ఇల్లు, స్థలం ఉండకూడదు. గతంలో ఎలాంటి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద లబ్ధి పొంది ఉండకూడదు. 50 శాతం ఫ్లాట్లను వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేశారు. ఇందులో ఎస్సీలకు 14%, ఎస్టీలకు 5%, బీసీలకు 16% కేటాయించారు. అలాగే వికలాంగులకు 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్, నాల్గో తరగతి పారిశుధ్య కార్మికులకు 10% చొప్పున కేటాయించారు. మిగిలిన 50 శాతం ఫ్లాట్లను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు కేవలం అధికారిక ’మీసేవ’ కేంద్రాల ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
‘ఇందిరమ్మ’ టవర్స్ ఇళ్లు ఇలా..
16 ప్రాంతాల్లో ఫ్లాట్ల సంఖ్య (తొలి విడత): ‘7,680 ఫ్లాట్లు
భవనాల నిర్మాణం: జీ + 10 (ఎ+10) టవర్స్
ఫ్లాట్ విస్తీర్ణం: ,525 చదరపు అడుగులు (కార్పెట్ ఏరియా: 400 చ.అ.)
మొత్తం ఫ్లాట్ విలువ: రూ. 11,00,000
ప్రభుత్వ రాయితీ (సబ్సిడీ): రూ. 5,00,000
లబ్ధిదారుడి వాటా: రూ. 6,00,000
దరఖాస్తు రుసుము: రూ.100
దరఖాస్తుతోపాటు టోకెన్ అడ్వాన్స్: రూ. 10,000
మొదటి విడత: (తాత్కాలిక కేటాయింపు సమయంలో): రూ. 1,00,000
రెండో విడత:(ఆర్సీసీ పూర్తయిన తర్వాత): రూ. 2,00,000
మూడో విడత (ఫినిషింగ్ పనుల దశలో): రూ. 2,00,000
నాలుగో విడత (ఇల్లు అప్పగించే సమయంలో): రూ. 90,000
ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లంటే..
రాజేంద్రనగర్: మైలార్దేవ్పల్లి (480), మహేశ్వరం: జల్పల్లి (480), శేరిలింగంపల్లి: రాయదుర్గం(480), ఇబ్రహీంపట్నం: తట్టిఅన్నారం, బండ్లగూడ (480). మల్కాజిగిరి: కౌకూర్ (480), నాంపల్లి: రెడ్హిల్స్ (360), నిలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్ (120), ఖైరతాబాద్: హకీంపేట్ దర్గా (120), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ (360), కార్వాన్: కుల్సుంపురా సమీప పోలీస్ క్వార్టర్స్ (480). బహదూర్పురా: నంది ముస్లాయిగూడ (480), అంబర్పేట్: సిటీ పోలీస్ లైన్స్ (480). కూకట్పల్లి: కేపీహెచ్బీ కాలనీ (480). మేడ్చల్: పోచారం ఎల్ఐజీ కాలనీ (480). కుత్బుల్లాపూర్: గాజులరామారం (480). సనత్నగర్: పాటిగడ్డ (480). కంటోన్మెంట్: మారేడ్పల్లి – మహేంద్రహిల్స్ (480). మలక్పేట్: గడ్డిఅన్నారం ఆర్ అండ్ బీ క్వార్టర్స్లో (480).


