సర్ ప్రక్రియలో ‘అన్కలెక్టబుల్’గా గుర్తించిన అధికారులు
జాబితాలో మృతులు, వలసలు, డూప్లికేట్ నమోదులు
ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియలో 13.34 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు ‘అన్కలెక్టబుల్’(సేకరించలేనివి)గా అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇవి 3.95 శాతం. మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు, డూప్లికేట్ నమోదులు, గుర్తించలేని ఓటర్లు వీరిలో ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 13,34,831 మంది ఓటర్లు ఈ అన్ కలెక్టబుల్ (బీఎల్ఓలు పంపిణీ చేసిన తర్వాత తిరిగి సేకరించలేని పత్రాలు) జాబితాలో ఉండగా.. వీరిలో 4,64,212 మంది (1.37 శాతం) మృతి చెందారు. అలాగే 6,39,553 మంది (1.89 శాతం)ని శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, చిరునామా మారిన వారు లేదా అందుబాటులో లేనివారిగా గుర్తించారు. మరో 1,73,115 మంది (0.51 శాతం) డూప్లికేట్ నమోదుల కింద ఉండగా, 53,324 మంది (0.16 శాతం) ఓటర్ల ఆచూకీ లభించలేదు. వీరుకాక మరో 4,677 మంది (0.01 శాతం) ‘ఇతరులు’విభాగంలో ఉన్నారు.
ముసాయిదా జాబితాలో ఉండరు!
ఎన్నికల విభాగం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) విచారణలో ఓటరు మరణించినట్లు తేలితే మృతుల కేటగిరీలో నమోదు చేస్తున్నారు. శాశ్వతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు స్థానిక విచారణలో తేలితే ‘పరి్మనెంట్గా షిఫ్ట్’అయినవారుగా గుర్తిస్తున్నారు. ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటరుగా నమోదై ఉంటే, సదరు ఓటరు ఎంపిక చేసుకున్న చోట జాబితాలో ఉంచి, రెండో దాన్ని ‘డూప్లికేట్’గా పేర్కొంటున్నారు. ఫారాలు తీసుకోవడానికి నిరాకరించిన వారు లేదా తిరిగి సమర్పించబోమని చెబుతున్న వారి పేర్లను ‘ఇతరులు’కేటగిరీలో చేర్చుతున్నారు. ఈ కేటగిరీల్లో ఉన్న ఓటర్ల పేర్లను ఆగస్టు 10న విడుదల చేయనున్న ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ధ్రువీకరణ ప్రక్రియలో అర్హత నిరూపించుకునే వారి పేర్లను తొలగించబోరని వివరించారు.
అర్హులెవరూ తప్పిపోకుండా..
పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేయడానికి ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు గడువును పొడిగించడం తెలిసిందే. ఈ సదుపాయాన్ని వినియోగించుకుని అందుబాటులో లేని ఓటర్లను గుర్తించి, అర్హులైన వారెవరూ జాబితా నుంచి తప్పిపోకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత గణాంకాల్లో హెచ్చుతగ్గులకు అవకాశముంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అందులో 2,25,25,055 (మొత్తం ఫారాల్లో దాదాపు 66.59 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు.
ఇంకా భారీగానే తొలగింపు?
అధికార వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉండగా.. తొలగించే ఓటర్ల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ నగరవాసులే సింహభాగం ఉంటారని అంటున్నారు. అందుకు కారణం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కొందరికి ఓట్లుండటం.. ఇక్కడ ఉంటున్నప్పటికీ, సొంత జిల్లాలో ఓటరుగా నమోదుకు ప్రాధాన్యతనిస్తుండటం తదితరాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. కాగా ముసాయిదా జాబితా తర్వాత ఎన్ని ఓట్లు తగ్గుతాయో స్పష్టం కానుంది.


