బహదూర్‌గూడ భూములపై తదుపరి చర్యలొద్దు | Telangana High Court Orders To Bahadurguda Lands | Sakshi
Sakshi News home page

బహదూర్‌గూడ భూములపై తదుపరి చర్యలొద్దు

Jul 21 2026 1:01 AM | Updated on Jul 21 2026 1:01 AM

Telangana High Court Orders To Bahadurguda Lands

28.06 ఎకరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడ సర్వే నంబర్లు 3, 5లోని 28.06 ఎకరాల భూమి విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కంచె ఏర్పాటు చేయడం లాంటి ప్రక్రియలన్నింటినీ ఆపాలని స్పష్టం చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ, విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. తమ ప్రైవేట్‌ భూమిలో అధికారులు జోక్యం చేసుకుంటూ, తమను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయతి్నస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి యాదిరెడ్డి, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు.

లంచ్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రఘునాథ్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లకు సర్వే నంబర్‌ 3, 5లో మొత్తం 28.06 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ప్రస్తుతం ఆ భూమిలో పంటలు సాగులో ఉన్నాయన్నారు.

 ఆ భూమిలోకి హైడ్రా అధికారులు అక్రమంగా ప్రవేశించి, గేట్లను కూల్చివేసి, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారన్నారు. పిటిషనర్లను తమ వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, పంటల సాగు కూడా నిలిచిపోయిందని చెప్పారు. పిటిషనర్లు.. 1989–90లో చట్టబద్ధంగా నమోదైన అమ్మకపు పత్రాల ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశారని, మూడు దశాబ్దాలుగా వారి స్వా«దీనంలోనే వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. 

నేడు విచారణ.. 
ప్రభుత్వం తరఫున ఏజీ ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ భూమి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరిస్తున్న సుమారు 650 ఎకరాల్లో భాగమన్నారు. పిటిషనర్లు సదరు భూమికి యజమానులని నిరూపించే చెల్లుబాటయ్యే రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్లు, పహాణీలు, ఈ–పాస్‌బుక్కులు, లింక్‌ డాక్యుమెంట్లు సమరి్పంచలేదని తెలిపారు.

పిటిషనర్లు భూమి సర్వే నంబర్లు 3, 5లో ఉందని చెబుతున్నప్పటికీ, బహదూర్‌గూడలో సర్వే నంబర్లు 28, 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అదే బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం స్వా«దీనం చేసుకుంటోందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. బహదూర్‌గూడలోని 28.06 ఎకరాల భూమికి సంబంధించి తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. ఇదిలా ఉండగా, ఇదే అంశంపై 85 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement