ఎస్సై ఐ ఫోన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో ఏముందో.. | Three Mysterious Deaths In Kamareddy | Sakshi
Sakshi News home page

ఎస్సై ఐ ఫోన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో ఏముందో..

Dec 28 2024 11:25 AM | Updated on Dec 28 2024 11:59 AM

Three Mysterious Deaths In Kamareddy

ముగ్గురి మృతి మిస్టరీ తేల్చేపనిలో పోలీసులు

కాల్‌డేటా పరిశీలన

 ఫోన్‌ల లాక్‌ ఓపెన్‌ అయితేనే స్పష్టత వచ్చే అవకాశం 

ముగ్గురు ఎందుకు కలవాల్సి వచ్చిందనే దానిపై దృష్టి

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు

భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట పీఎస్‌ కానిస్టేబుల్‌ శృతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శివ మృతి మిస్టరీని ఛేదించే పనిలో ఉన్న పోలీసులకు ఆ ముగ్గురి వాట్సాప్‌ చాటింగ్‌, వారు ప్రయాణించిన ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ కీలకమైంది. ముగ్గురూ మృతి చెందడంతో అసలేం జరిగి ఉంటుందనేదిపెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురి ఫోన్‌లలోని వాట్సాప్‌ చాటింగ్‌పైఆధారపడ్డారు. అలాగే సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏకకాలంలో జరిగిన ముగ్గురి మరణాల మిస్టరీని తేల్చేందుకు పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. చాలా కాలంగా క్లోజ్‌గా ఉన్న వాళ్లు కలిసి చనిపోవడానికి కారణాలు ఏమిటనేదానిపై ఆరా తీస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో బుధవారం సాయంత్రం భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, బీబీపేట పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శ్రుతి, బీబీపేటకు చెందిన నిఖిల్‌లు చనిపోయిన విషయం తెలిసిందే. ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ చనిపోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

కేసు మిస్టరీని ఛేదించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై సాయికుమార్‌ వద్ద రెండు ఫోన్లు, కానిస్టేబుల్‌ శ్రుతి ఒక ఫోన్‌, నిఖిల్‌ రెండు ఫోన్లు వాడినట్లు నిర్ధారణకు వచ్చారు. ముగ్గురి కాల్‌ డేటాను ఇప్పటికే పరిశీలించారు. గడిచిన వారం రోజుల్లో ముగ్గురు పలుమార్లు కాల్స్‌ మాట్లాడినట్లు కాల్‌డేటా ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్య ఉన్న పరిచయాలు, వాళ్లు సడెన్‌గా ఆ రోజు ఎందుకు కలవాల్సి వచ్చింది ? అక్కడ జరిగిన గొడవ ఏమిటి? అనే అంశాలపై పోలీసులు ఫోకస్‌ చేస్తున్నారు.

భిక్కనూరు నుంచి అడ్లూర్‌ ఎల్లారెడ్డి దాకా..
విచారణలో భాగంగా పోలీసు అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. భిక్కనూరు టోల్‌ ప్లాజా దగ్గర నుంచి మొదలుకుని అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు వరకు జాతీయ రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. జాతీయ రహదారిపై ఓ దాబా హోటల్‌ సమీపంలో నిఖిల్‌ బైకును ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్‌ వద్ద కలిసి భోజనం చేశారన్న ప్రచారం జరగడంతో అధికారులు హోటల్‌ సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. 

అయితే అక్కడ సీసీ ఫుటేజీని చెక్‌ చేసే క్రమంలో అవి పనిచేయడం లేదని చెబుతున్నారు. అక్కడి నుంచి ముగ్గురు కలిసి కారులో కామారెడ్డి పట్టణంలోకి రాకుండా బైపాస్‌ రోడ్డు గుండానే నిజామాబాద్‌ రూట్లో వెళ్లినట్టు భావిస్తున్నారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో రోడ్డు పక్కన కారు ఆపుకుని డిస్కషన్‌ చేసి ఉంటారని, తరువాత ఎవరి కంట పడకుండా ఉండేందుకు చెరువు కట్టపైకి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ముగ్గురి చావుల మిస్టరీ తేల్చడం పోలీసులకు సవాల్‌గానే మారిందని చెప్పాలి.

వాట్సాప్‌ చాటింగ్‌లో ఏముందో..
ముగ్గురు కూడా రెగ్యులర్‌గా వాట్సాప్‌ వాడుతున్నట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో నిర్ధారించుకున్నారు. ఎస్సై సాయికుమార్‌ వాడుతున్న రెండు ఫోన్‌లలో ఒకటి కారులో ఉండగా, మరో ఫోన్‌ ఆయన ప్యాంట్‌ జేబులోనే ఉండిపోయింది. నీటిలో మునిగిపోవడంతో ఫోన్‌ ఆన్‌ కావడం లేదని తెలుస్తోంది. కారులో ఉన్న ఐ ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ ఉండడంతో ఓపెన్‌ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. 

అయితే ఎస్సై ఫోన్‌ లాక్‌ గురించి ఆయన భార్యను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తనకు తెలియదనే సమాధానం వచ్చినట్లు సమాచారం. నిఖిల్‌ వాడుతున్న రెండు ఫోన్‌లలో ఒకటి లాక్‌ ఓపెన్‌ కావడం లేదని, మరొకదానిలో పెద్దగా చాటింగ్‌ లేనట్టు చెబుతున్నారు. శ్రుతి ఫోన్‌ లాక్‌ సైతం ఓపెన్‌ కాలేదని తెలుస్తోంది. వాటిని ఓపెన్‌ చేయించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్‌ చాటింగ్‌లో కచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుందనే నమ్మకంతో పోలీసులు ఉన్నారు.

కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement