ఉదయ్‌ కృష్ణారెడ్డికి సీబీఐ మాజీ అధికారి అండ | Former IPS Officer Backs Uday Krishna Reddy Calls for Fair Probe | Sakshi
Sakshi News home page

ఉదయ్‌ కృష్ణారెడ్డికి సీబీఐ మాజీ అధికారి అండ

Jul 21 2026 1:31 PM | Updated on Jul 21 2026 1:40 PM

Former IPS Officer Backs Uday Krishna Reddy Calls for Fair Probe

హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు పోలీస్‌ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. మహిళా ఐపీఎస్‌ ప్రొబేషనర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసు నమోదు.. మనస్తాపం చెందిన ఉదయ్‌ అత్మహత్యాయత్నం చేయడం.. ఆపై సంచలన ఆరోపణలతో ఈ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ మన్నెం నాగేశ్వరరావు స్పందించారు.

ఉదయ్‌ కృష్ణారెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ మన్నెం నాగేశ్వరరావు సోషల్‌ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగకముందే ఒక అధికారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడకూడదని, నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాత్కాలిక సస్పెన్షన్‌ను కూడా ఆయన తప్పుబట్టారు.

కష్టాల నుంచి ఐపీఎస్‌ వరకు..
ఉదయ్‌ కృష్ణారెడ్డి ప్రయాణాన్ని ప్రస్తావించిన మన్నెం నాగేశ్వరరావు.. అతని ఎదుగుదల ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉదయ్‌ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య అమ్మమ్మ సంరక్షణలో పెరిగారని తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆయన.. జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఉన్నత లక్ష్యాన్ని వదులుకోకుండా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.

కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివి ఐపీఎస్‌కు ఎంపిక కావడం అసాధారణ విజయమని, గ్రామీణ యువతకు ఆయన ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందని మన్నెం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

రెండు వాదనలు.. ఆధారాలే కీలకం
ప్రస్తుత వ్యవహారంలో రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయని మాజీ ఐపీఎస్‌ అధికారి పేర్కొన్నారు. మహిళా ప్రొబేషనర్‌ తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఉదయ్‌ కృష్ణారెడ్డి మాత్రం తమ మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్నారని వివరించారు. వ్యక్తిగత సంబంధం విఫలమైన తర్వాత ఏర్పడిన వివాదాలను పూర్తిగా నేరపరమైన కోణంలోకి తీసుకెళ్లే ముందు.. వాస్తవాలు, ఆధారాలను పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

సస్పెన్షన్‌పై ప్రశ్నలు
ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే ఉదయ్‌ కృష్ణారెడ్డిపై తీసుకున్న పరిపాలనా చర్యలపై కూడా మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ పూర్తికాకముందే ఒక యువ అధికారి భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే ఘటనలో ఇద్దరు వ్యక్తులు భాగస్వాములైతే.. పరిపాలనా చర్యలు కూడా సమానంగా ఉండాలనే సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.

శిక్షణ సంస్థల బాధ్యత
ఐపీఎస్‌ అధికారులను తీర్చిదిద్దే ఎస్‌వీపీఎన్‌పీఏ కేవలం క్రమశిక్షణ అమలు చేసే సంస్థ మాత్రమే కాకుండా.. యువ అధికారులకు మార్గదర్శకత్వం, మానసిక సహకారం అందించే వేదికగా ఉండాలని మన్నెం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక ఆరోపణ లేదంటే వివాదం కారణంగా ఒక అధికారి కష్టపడి సాధించిన కెరీర్‌ నాశనం కాకూడదని, విచారణ పూర్తయ్యే వరకు న్యాయ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని కోరారు.

‘నిష్పక్షపాత విచారణ జరగాలి’
ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో చట్టం తన పని తాను చేసుకోవాలని, అదే సమయంలో న్యాయం, సమానత్వ సూత్రాలు పాటించాలని మన్నెం నాగేశ్వరరావు కోరారు. కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఐపీఎస్‌ వరకు ఎదిగిన యువ అధికారి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ఆధారాల ఆధారంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మన్నెం నాగేశ్వరరావు నేపథ్యం..
మన్నెం నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిశా క్యాడర్‌లో సేవలందించారు. సీబీఐలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. 2018లో సంస్థలో పరిణామాల సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు.. పోలీస్‌, దర్యాప్తు విభాగాల్లో కీలక అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసుపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement