పెద్దపల్లి: అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి ఇంటినుంచి వెళ్లగొట్టారని ఆరోపిస్తూ భజ్జురి రేఖలత సోమవారం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం..
పెద్దపల్లికి చెందిన రేఖలతకు భీమారం ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కుమార్తో వివాహం జరిగింది. కొంతకాలం వరకు దాంపత్యజీవితం సజావుగానే సాగినా.. ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త, కుటుంబ సభ్యులు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇకపై సక్రమంగా చూసుకుంటానని భర్త హామీ ఇచ్చాడు.
కానీ, ఇంటికి తీసుకెళ్లకుండా వాట్సాప్ సందేశాలు, నోటీసుల ద్వారా వేధింపులకు పాల్పడ్డాడు. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని, భౌతిక దాడులకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆర్థిక ఆధారం లేకుండా పెద్దపల్లిలో అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న రేఖలత.. తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు, తోటి కోడలు, బావల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు.


