సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తీవ్ర అవమానం జరిగింది. హైకోర్టు గేట్ నంబర్ 6 నుంచి ఎంట్రీకి పోలీసులు నిరాకరించారు. సాధారణ ప్రజలు వచ్చే గేట్ నంబర్ 4 నుంచి రావాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొటోకాల్ అనుమతి అవసరమని వెల్లడించారు. గేట్ నంబర్ 4 వద్ద ప్రజలు పార్కింగ్ చేసే ప్రాంతంలో కారును ఆపి నడుచుకుంటూ వెళ్లమంటూ పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం(సోమవారం) ఆరు గంటల సమయంలో ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరైన సమయంలో ఇది జరిగింది.
ఇదిలా ఉండగా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని తేల్చిచెప్పింది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదని, ఏ పనైనా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేసింది. ఐపీఎస్కు కూడా చెప్పాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసులో మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే ఆయనకు కోర్టులపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని వ్యాఖ్యానించింది.
నిన్న సాయంత్రం ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద హడావుడి నెలకొంది. ఏజీ సుదర్శన్రెడ్డి, ఏఏజీ ఇమ్రాన్ఖాన్, స్పెషల్ జీపీలు, జీపీలు అంతా విచారణకు హాజరయ్యారు. హైడ్రా తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జీఎల్ఆర్(కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూమి) సర్వే నంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే చేయడానికి, విభజన చేపట్టడానికి కొంత గడువివ్వాలని కోరారు.

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గతంలో కలెక్టర్ ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు విభజనకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీఎల్ఆర్ భూమి అని చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఐపీఎస్ అధికారైన ఏవీ రంగనాథ్కు చట్టంపై నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ తీరుతో వ్యవహరించారన్నారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.


