సాక్షి, అనకాపల్లి జిల్లా: కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ అరాచకంపై వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ ఇవాళ (మంగళవారం) చలో పంచదార్ల’ పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. వేలాది బైకులు, వందలాది కార్లతో వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచదార్ల కొండలను వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు
యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమబాటలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం: బొత్స
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం చేస్తున్నామన్నారు. పంచదార్ల కొండలను దోపిడీ చేస్తున్నారు. ప్రజా ఉద్యమంలా మారకుండా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ మైనింగ్ ఆపకపోతే మళ్ళీ ఇక్కడికి వస్తాం. వాస్తవాలు ప్రజలకు తెలియాలని మీడియాను మొత్తం తీసుకువచ్చాం
అక్రమ మైనింగ్కు పాల్పడేది చిన్న వ్యక్తులు కాదు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు కలిపి దోచుకుంటున్నారు. రోజు సనాతన ధర్మం అంటారు, ఎక్కడ ఉంది మీ సనాతన ధర్మం. మీకు కళ్లు ఉంటే కూటమి పెద్దలు వచ్చి అక్రమ మైనింగ్ చూడండి. పంచదార్ల కొండ కోసం మేము పోరాటం చేస్తుంటే కుట్ర దాగి ఉందని మాట్లాడతారా?. ఏమి కుట్ర దాగి ఉందో కూటమి నేతలు చెప్పాలి. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలియదు. పాపం కూటమి నేతలకు తగులుతుంది. రేపు ఉదయం మైనింగ్ వాహనాలు పంచదార్ల కొండపై ఉండకూడదు. ఉంటే నడిరోడ్డుపై ధర్నా చేస్తాం’’ అని బొత్స హెచ్చరించారు.


