సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎస్ ముందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి తోపులాట జరిగింది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ముఖ్య నేతలు బోయనపల్లి పీఎస్లోనే ఉన్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
కాగా పోలీస్ స్టేషన్లోనూ బీఆర్ఎస్ నేతలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యంలో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘర్షణ వాతావరణంతో హైదరాబాద్ -సిద్ధిపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. శామీర్పేట దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు జవహర్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హరీశ్ రావును వెంటనే విడుదల చేయాలని స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పీఎస్ లోనికి వెళ్లడానికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి..కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్


