TG: ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం | Telangana Government Appoints Nri Advisory Committee | Sakshi
Sakshi News home page

TG: ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం

Apr 10 2025 6:15 PM | Updated on Apr 10 2025 6:34 PM

Telangana Government Appoints Nri Advisory Committee

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జీవో విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. 

కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు. గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు  సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు. 

సీఎం హామీ నేపథ్యంలో..
గత సంవత్సరం ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది. 

ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పనతో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement