
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్ల (రూ. 88 లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు టెక్ నిపుణులు సహా అక్కడి భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న భారతీయ టెక్ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే భారతీయ నిపుణులు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.