45 రోజులుగా దొరకని ఆచూకీ..
హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
హస్తినాపురం: ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ వెళ్లిన నగర విద్యార్థి అదృశ్యమయ్యాడు. 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటీ పర్యంతమవుతున్నారు.
వనస్థలిపురం వైదేహి నగర్కాలనీకి చెందిన మర్ణత, ముత్యంరెడ్డిల కుమారుడు మణిదీప్రెడ్డి ఫిన్లాండ్ లోని ఎల్యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 4న తల్లిదండ్రులతో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్ మే 5 నుంచి ఫోన్చేసినా స్పందించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. ఫిన్లాండ్లోని కుమారుడి స్నేహితులు, తెలిసిన వారిని నివాస ప్రాంతానికి, కాలేజీకి పంపించినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో అక్కడ మణిదీప్రెడ్డి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా తమ కుమారుడు మణిదీప్రెడ్డిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, అధికారులను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశం
ఫిన్లాండ్లో తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ మణిదీప్రెడ్డి తల్లిదండ్రులు జి.మర్ణత, ముత్యంరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదృశ్యంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మణిదీప్రెడ్డి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు వివరించాలంటూ కేంద్రం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్రెడ్డి విచారణ చేపట్టారు. న్యాయమూర్తి విచారణను ఈనెల 24కు వాయిదా వేశారు.


