హైదరాబాద్: జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాస్పోర్ట్, వీసా లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని జోగిపేటలో డిపోర్టేషన్కు తరలించారు. విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన నిఘా వర్గాల సమాచారం ఆధారంగా... గాజులరామారం–జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో ఉన్న ఒక అద్దె ఇంట్లో కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు.
ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ బంగ్లాదేశీయులు పట్టుబడుతుండడం గమనార్హం.
భారత్లో ఉండేందుకు అవసరమైన పత్రాలు లేని వందలాది బంగ్లాదేశీయులు ఇటీవలే పశ్చిమ బెంగాల్లోని బితారి-హకింపూర్ సరిహద్దు కేంద్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అక్రమ వలసదారులపై భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న "గుర్తించు-తొలగించు-బహిష్కరించు" వ్యూహం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లాలని వారు ప్రయత్నించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి అనుమానిత చొరబాటుదారులందరికీ వెళ్లిపోవాలని, లేకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. "జల్దీ జల్దీ భాగో నహీ తో జో కర్నా హై సర్కార్ కరేగా (వెంటనే పారిపోండి, లేకపోతే ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది)" అని ఆయన అన్నారు. నిర్బంధంలో ఉన్నవారిని స్వదేశానికి పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యా, ఇతర వలసదారుల కోసం 23 జిల్లాల్లో "నిర్బంధ కేంద్రాలు" ఏర్పాటు చేసింది. ఏడాది పాటు అప్పటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిలిపివేసిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది.


