కంటోన్మెంట్‌ ఫలితంపై ఉత్కంఠ | Secunderabad Cantonment Assembly By Election Counting | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌ ఫలితంపై ఉత్కంఠ

Jun 3 2024 7:06 AM | Updated on Jun 3 2024 7:28 AM

Secunderabad Cantonment Assembly By Election Counting

హైదరాబాద్‌, సాక్షి: కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది.వెస్లీ కళాశాల ప్రాంగణంలోని రెండు వేర్వేరు హాళ్లలో కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ఎంపికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును వేర్వేరుగా నిర్వహించనున్నారు. మంగళవారం (రేపు) ఉదయం ఆయా కేంద్రాల్లో ఒకేసారి కౌంటింగ్‌ మొదలు కానుంది. మొత్తం 232 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో రౌండ్‌లో 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల చొప్పున మొత్తం 17 రౌండ్‌ల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. 

తొలుత బ్యాలెట్‌ ఓట్లు, అనంతరం సాధారణ  ఈవీఎంల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు లెక్కింపు ప్రక్రియ కొలిక్కి రానుందని అధికారులు వెల్లడించారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం జిల్లాల వారీగా హైదరాబాద్, పార్లమెంట్‌ స్థానం వారీగా చూస్తే మేడ్చల్‌– మల్కాజ్‌గిరి పరిధిలోకి వస్తోంది. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు బోగారంలోని హోలీ మేరీ కళాశాల ప్రాంగణంలో, ఎల్‌బీ నగర్‌ అసెంబ్లీ పరిధిలోని ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం ఆవరణలో జరగనుంది. కంటోన్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు మాత్రం సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాల ఆవరణలో జరగనుంది. 

సర్వత్రా ఆసక్తి  
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరు నెలల క్రితం నాటి ఎన్నికల్లో 1,23,297 ఓట్లు పోలవ్వగా, తాజాగా 1,30,929 మంది ఓటేశారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్య నందిత 59,057 ఓట్లు సాధించగా, బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేశ్‌కు 41,888, కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నెలకు 20,825 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో ఆయా పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్, కాంగ్రెస్‌ అభ్యరి్థగా మారారు. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ వంశ తిలక్‌కు టికెట్‌ ఇచి్చంది. బీఆర్‌ఎస్‌ తరఫున దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత బరిలో నిలిచారు.

వార్డు నేతల్లోనూ టెన్షన్‌
కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానిక వార్డు నేతల్లోనూ టెన్షన్‌ కొనసాగుతోంది. తమ వార్డులో పార్టీకి మెజారిటీ వస్తుందా లేదా అని ఆయా నేతలు ఆలోచనలో పడిపోయారు. అభ్యర్థి గెలుపోటములతో సంబంధం లేకుండా, తమ వార్డులో మెజారిటీ వస్తే చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఓటింగ్‌ సరళిపై ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement