అందరిచూపు ‘బాంకీపూర్‌’ వైపే..! | Triangular war in bihar Bankipur assembly by election | Sakshi
Sakshi News home page

అందరిచూపు ‘బాంకీపూర్‌’ వైపే..!

Jul 9 2026 4:32 AM | Updated on Jul 9 2026 4:32 AM

Triangular war in bihar Bankipur assembly by election

నితిన్‌ నబీన్‌ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో త్రిముఖపోరు

కాయస్థ కులానికి చెందిన యువ నేతకు బీజేపీ టిక్కెట్‌

బంకీపూర్‌ నుంచి తన తొలి రాజకీయ పరీక్షను ఎదుర్కొనున్న ప్రశాంత్‌ కిశోర్‌

మహాఘట్‌బంధన్‌లోని కాంగ్రెస్‌ను కాదని సొంత అభ్యర్థిని నిలబెట్టిన ఆర్జేడీ

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్‌లోని బాంకీపూర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తమ యువ నేత అభిషేక్‌ కుమార్‌ను అభ్యర్థిగా నిలిబెట్టింది. జన్‌ సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షం ఉమ్మడి మద్దతు లభిస్తుందన్న ప్రచారానికి చెక్‌ పెడుతూ ఆర్జేడీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తాను మరోసారి అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక్కడ త్రిముఖ పోరుకు తెరతీసింది. 

బాంకీపూర్‌ బీజేపీకి బలమైన పట్టున్న నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. 1995 నుంచి వరుసగా ఈ స్థానాన్ని బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఈ స్థానం నుంచి నితిన్‌ నబిన్‌ ఐదు సార్లు, ఆయన తండ్రి నాలుగుసార్లు గెలిచారు. జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యాక నబీన్‌ రాజ్యసభకు వెళ్లడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభిషేక్‌ను ఈసారి బరిలో నిలిపింది. నబీన్‌ మాదిరే అభిషేక్‌ సైతం కాయష్థ కులానికి చెందిన నేత. రాజకీయ వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్‌ కిశోర్‌కు ఇది తొలి ఎన్నిక. 

బీజేపీ బలమైన కోటలోనే పోటీకి దిగడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఉపఎన్నికను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా ఆయన అభివర్ణిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ బరిలోకి దిగిన తర్వాత బీజేపీని ఎదుర్కోవాలంటే మహాఘఠ్‌బంధన్‌ ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ వర్గాలు సూచించాయి. అయితే తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ అందుకు అంగీకరించకుండా స్వంత అభ్యర్థి రేఖా గుప్తాను ప్రకటించింది. దీంతో విపక్షాల అనైక్యతతో ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశాలు పెరిగాయి.

కుల సమీకరణాలే కీలకం...
బాంకీపూర్‌ నియోజకవర్గంలో 3.91లక్షల ఓటర్లలో కాయస్థ ఓటర్లు ప్రభావవంతమైన వర్గంగా పరిగణిస్తారు. వారి తర్వాత వైశ్య ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. ఓటర్లలో 14శాతం మంది కాయస్థులేనని, వీరి సంఖ్య దాదాపు 65వేలు ఉంటుందని అంచనా. యాదవ్‌ ఓటర్లు 12 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ముస్లింలు 10 శాతం, చంద్రవంశీయులు 9, వైశ్యులు 9, దళితులు 8, భూమిహార్‌ 7, బ్రాహ్మణులు 7, రాజపుత్రులు 5, కుర్మీలు 5, కుష్వాహాలు 3 శాతం ఉన్నారు. బీజేపీ సంప్రదాయ కాయస్థ మద్దతును నిలబెట్టుకోవాలని చూస్తుండగా, ఆర్జేడీ వైశ్య, ముస్లిం, యాదవ్‌ ఓట్ల కలయికపై దృష్టి పెట్టింది. ప్రశాంత్‌ కిశోర్‌ అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలో సామాజిక సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఘట్‌బంధన్‌లో విభేధాలతో పీకేకు కష్టాలు..
బాంకీపూర్‌ ఉప ఎన్నిక ద్వారా తన రాజకీయ ఆరంగ్రేటాన్ని బలంగా చాటాలనుకున్న ప్రశాంత్‌ కిషోర్‌కు ప్రతిపక్షం నుంచే అవరోధాలు ఏర్పడుతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ భోజ్‌పూర్‌ ఎన్‌కౌంటర్, నీట్‌ విద్యార్థి కేసు, టెండర్ల కుంభకోణం, నిరుద్యోగం, అవినీతి వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతున్నారు. ఈ సమస్యలపై ప్రజలు తమ తీర్పును వెలిబుచ్చడానికి ఉప ఎన్నిక ఒక అవకాశమని అంటున్నారు. అయితే ఆయనకు ఉమ్మడి మద్దతివ్వాలన్న ప్రతిపాదనను ఆర్జేడీ పెడచెవిన పెట్టి రేఖా గుప్తాను పోటీలో నిలిపింది. ఆమె వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఈ వర్గం ఓట్లు, సంప్రదాయ ముస్లిం–యాదవ్‌ ఓటు బ్యాంక్‌ కలిస్తే గట్టి పోటీ ఇవ్వవచ్చని ఆర్జేడీ అంచనా వేస్తోంది. ఆమె పోటీతో ఓట్ల చీలిక జరిగి బీజేపీకి లాభించడం ఖాయంగా కనిపిస్తోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement