ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు | road Accident at Khairatabad flyover | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు

Jul 24 2024 10:21 AM | Updated on Jul 24 2024 10:21 AM

road Accident at Khairatabad flyover

ఖైరతాబాద్‌: స్నేహితుడిని సొంత ఊరిలో వదిలిపెట్టి సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పైకి రాగానే ముందు ఉన్న యాక్టీవా డివైడర్‌కు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలో నివాసముండే సోఫియాన్‌ అహ్మద్‌(20), మహ్మద్‌ సమీ, సయ్యద్‌ సైఫ్‌ ముగ్గురు యాక్టివా వాహనంపై, మరో ద్విచక్రవాహనంపై సయ్యద్‌ నుమాన్, మహ్మద్‌ అహ్మద్‌ అలీ, మూడో వాహనంపై మహ్మద్‌ తాహెర్‌ అలీ, ఆదిల్‌ కలిసి సోమవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో మెదక్‌లో ఉండే ఆదిల్‌ను దింపడానికి వెళ్లారు. 

అతడిని అక్కడ దింపి అక్కడే సరదాగా గడిపి తిరిగి రాత్రి 10.30 గంటలకు నగరానికి బయల్దేరారు. అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో వీరి ముగ్గురి ద్విచక్రవాహనాలు ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్‌ మధ్యలోకి రాగానే సోఫియాన్‌ అహ్మద్‌ నడుపుతున్న యాక్టీవా ఢివైడర్‌కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డివైడర్‌ మధ్యలో ఉన్న పూలకుండీ బలంగా సోఫియాన్‌ అహ్మద్‌కు తగిలింది. యాక్టివాపై ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

సోఫియాన్‌ అహ్మద్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన సోఫియాన్‌ అహ్మద్‌ పాన్‌షాపు నిర్వహిస్తుండగా వీరిలో మరో ఇద్దరు చదువుకుంటున్నారు. అర్ధరాత్రి వర్షంతో పాటు వాహనం స్పీడ్‌గా ఉండటం వల్లే అదుపు తప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సయ్యద్‌ సైఫ్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సందీప్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌పై ఆదివారం ద్విచక్రవాహనంపై స్పీడ్‌గా వెళ్తూ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అదే ఫ్లై ఓవర్‌పై మరో ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement