పరీక్ష రాసి వస్తూ.. పైలోకాలకు.. | Road accident on Gachibowli flyover | Sakshi
Sakshi News home page

పరీక్ష రాసి వస్తూ.. పైలోకాలకు..

Mar 23 2025 7:53 AM | Updated on Mar 23 2025 7:53 AM

Road accident on Gachibowli flyover

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం 

ఎస్సెస్సీ విద్యార్థిని దుర్మరణం 

 మృతురాలి సోదరుడికి గాయాలు

 

హైదరాబాద్‌: గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదో తరగతి పరీక్ష రాసి సోదరుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొట్టడంతో విద్యారి్థని మృతి చెందింది. ఆమె సోదరుడు గాయాల పాలయ్యాడు. పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని టీఎన్‌జీఓ కాలనీలో ఉంటున్న పెనుదాస్‌ చత్రియా, సబితా చత్రియా దంపతులకు కుమారుడు సుమన్‌ చత్రియా, కుమార్తె ప్రభాతి చత్రియా (16) ఉన్నారు. ప్రభాతి చత్రియా రాయదుర్గంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠ«శాలలో ఆమె పదో తరగతి పరీక్షలు రాస్తోంది. 

శనివారం ఆమె పరీక్ష రాసిన అనంతరం సోదరుడు సుమన్‌ ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో గచ్చిబౌలి ప్లైఓవర్‌పైకి రాగానే వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రికల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సుమన్‌ ఎడమ వైపు పడిపోగా ప్రభాతి కుడివైపు పడిపోయింది. బస్సు వెనుక చక్రం ప్రభాతి పైనుంచి వెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

సుమన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభాతి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్షలు రాస్తున్న తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ప్రభాతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన 
దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.    

Advertisement
 
Advertisement
Advertisement