యుద్ధతంత్రాన్ని సాంకేతికత మార్చింది | Rajnath Singh reviews Combined Graduation Parade at Air Force Academy | Sakshi
Sakshi News home page

యుద్ధతంత్రాన్ని సాంకేతికత మార్చింది

Jun 14 2026 5:52 AM | Updated on Jun 14 2026 5:52 AM

Rajnath Singh reviews Combined Graduation Parade at Air Force Academy

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరిస్తున్న రాజ్‌నాథ్‌సింగ్‌

కనిపించని శత్రువుతో పోరులో అప్రమత్తంగా ఉండాలి 

భవిష్యత్‌ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి 

యువ అధికారులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచన 

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఘనంగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ 

తొలి మహిళా ఎన్‌డీఏ క్యాడెట్ల బృందం సహా 231 మంది ఐఏఎఫ్‌లోకి

సాక్షి, హైదరాబాద్‌: ‘ఒకప్పుడు యుద్ధం అంటే సైనికుడు, ఆయుధం కనిపించేవి. ప్రస్తుతం యుద్ధస్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి యుద్ధాల్లో ప్రత్యర్థి ఎవరో, ఆయుధం ఎక్కడి నుంచి వస్తుందో కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ట్రాఫిక్‌ నెట్‌వర్క్‌లు, సీసీటీవీ వ్యవస్థలను కూడా హ్యాక్‌ చేసి నియంత్రించే స్థాయికి సైబర్‌ యుద్ధం చేరుకుంది. ఇప్పుడు రాడార్లు, ఉపగ్రహాలు, డ్రోన్లు, సెన్సార్లు, రోబోటిక్స్‌ వంటి వ్యవస్థలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’అని భారత వైమానిక దళాని (ఐఏఎఫ్‌)కి చెందిన యువ అధికారులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దిశానిర్దేశం చేశారు. భవిష్యత్‌ యుద్ధ వ్యూహాలు, సాంకేతికతలను వినియోగించే సామర్థ్యం అధికారుల్లో ఉండాలన్నారు.

అత్యాధునిక, తక్కువ పరిమాణంలో ఉన్న ఆయుధాలతో చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలకు నష్టం కలిగిస్తున్న ఉదాహరణలు (పరోక్షంగా ఇరాన్‌–అమెరికా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ) ప్రపంచంలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో శనివారం 217వ కోర్సు కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ నిర్వహించారు. మొత్తం 231 మంది ఫ్లైట్‌ క్యాడెట్లు (194 మంది పురుషులు, 37 మంది మహిళలు) వైమానిక దళంలో అధికారులుగా నియమితులయ్యారు.

వారిలో తొలిసారిగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్‌ కూడా ఉండటం విశేషం. వారితోపాటు నౌకాదళానికి చెందిన 9 మంది, కోస్ట్‌గార్డ్‌కు చెందిన ముగ్గురు, వియత్నాంకు చెందిన ఇద్దరు అధికారులు పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై యువ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వాయుసేనకు సంబంధించిన శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లకు ప్రెసిడెంట్‌ కమిషన్‌ (వైమానిక దళంలో అధికారులుగా గుర్తింపు) ప్రదానం చేశారు. 

దేశానికి రక్షణ కవచం వైమానిక దళం.. 
అనంతరం రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ భారత వైమానిక దళం దేశానికి కేవలం రక్షణ కవచమే కాకుండా అవసరమైనప్పుడు శత్రువుపై విరుచుకుపడే ఖడ్గంగా కూడా వ్యవహరించిందన్నారు. 1947–48 కశ్మీర్‌ యుద్ధంలో శ్రీనగర్‌ ఎయిర్‌లిఫ్ట్, 1971 యుద్ధంలో వైమానిక దాడులు, 2025లో ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్రవాద స్థావరాలపై అత్యంత కచి్చతత్వంతో చేపట్టిన దాడులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక వేదికలతోపాటు ఐఏఎఫ్‌ అధికారుల ధైర్యం, క్రమశిక్షణ వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైందని రాజ్‌నాథ్‌ కొనియాడారు. 

నారీ శక్తితో ఐఏఎఫ్‌ మరింత శక్తివంతం.. 
వైమానిక దళంలో మహిళల సంఖ్య పెరగడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పందిస్తూ నారీ శక్తి భాగస్వామ్యం ఐఏఎఫ్‌ను మరింత సమతుల్యంగా, శక్తివంతంగా మారుస్తుందన్నారు. ఇది భారత సాయుధ దళాల సమగ్రతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘ఆకాశమే హద్దు కాదు... ఆకాశమే మన ఇల్లు అనే దృక్పథంతో ముందుకు సాగాలి. అదే వికసిత్‌ భారత్‌–2047 లక్ష్య సాధనకు దోహదపడుతుంది’అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. 

ఉత్తమ అధికారులకు పురస్కారాల ప్రదానం.. 
శిక్షణలో ఉత్తమ ప్రతిభకనబర్చిన ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ఆశిష్ కుమార్‌ యాదవ్‌ ప్రెసిడెంట్‌ ప్లాక్, నవానగర్‌ స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ (పైలట్‌ కోర్సులో అగ్రస్థానం), ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ ఏక్తా గుప్తా నావిగేషన్‌ విభాగంలో ప్రెసిడెంట్‌ ప్లాక్, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ దివ్యాంశి సింగ్‌ గ్రౌండ్‌ డ్యూటీ విభాగంలో ప్రెసిడెంట్‌ ప్లాక్‌ అందుకున్నారు. ఆశిష్ కుమార్‌ యాదవ్‌ పరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు.

పరేడ్‌ ప్రారంభానికి ముందు త్రివిధ దళాలకు చెందిన తొలి మహిళా డ్రిల్‌ టీం 303 రైఫిల్స్‌తో చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానిక దళాధిపతి ఏపీ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఫ్లైపాస్ట్‌ ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, ఎయిర్‌ మార్షల్‌ సీతపల్లి శ్రీనివాస్, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ రాహుల్‌ బసీ, డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్‌ సీపీ రమేశ్‌రెడ్డి, యువ అధికారుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement