టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న న్యాయ వర్గాలు
ఒక రిటైర్డ్ జడ్జిని బూతులతో దూషించడం దారుణం
నానిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల డిమాండ్
సీఎం చంద్రబాబు మౌనంపై న్యాయ వర్గాల్లో అసహనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.
గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణలను ప్రశ్నించినందుకు రిటైర్డ్ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. నానిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయవ్యవస్థ అంటే తమకు అపార గౌరవమని తరచూ చెప్పే చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ నేతలు ఈ విధంగా న్యాయ వ్యవస్థపై దాడి చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
సీఎం తీరు చూస్తుంటే ఈ వైఖరిని ప్రోత్సహిస్తున్నట్లుందని తప్పు పడుతున్నారు. నానిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేని పక్షంలో ఆందోళనకు సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ను విమర్శించినా, తప్పులను ఎత్తిచూపినా వెంటనే అరెస్ట్ చేయిస్తున్న ప్రభుత్వానికి.. పులివర్తి నాని బూతులు, బెదిరింపులు వినిపించకపోవడం విశేషం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ న్యాయమూర్తులే లక్ష్యం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ పచ్చ మూకలు న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేస్తూ చెలరేగిపోయాయి. చంద్రబాబుకు లేదా తెలుగుదేశం పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చినా, తీర్పులు ఇచ్చినా సహించలేని పచ్చ ముఠాలు సోషల్ మీడియా వేదికగా దూషణలు సాగించాయి. స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు రిమాండ్ విధించిన మహిళా న్యాయాధికారిని అత్యంత జుగుప్సాకరంగా, అసభ్య పదజాలంతో కొన్ని నెలలపాటు దూషిస్తూ వచ్చాయి. అలాగే కొందరు హైకోర్టు న్యాయమూర్తులను సైతం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దారుణంగా దుష్ప్రచారం సాగించారు. వీటిని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది.
నానికి కొమ్ముకాస్తున్న టీడీపీ పెద్దలు
వృద్ధ దంపతులు దశాబ్దాల క్రితం కష్టపడి కొనుక్కున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకోవడమే కాకుండా, దానికి అడ్డుపడిన వారిపై అధికార బలంతో పులివర్తి నాని విరుచుకుపడటం, అతనికి అధికార పార్టీ పెద్దలు కొమ్ము కాయడం రాజకీయ దురహంకారానికి పరాకాష్టగా న్యాయవర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఆ వృద్ధ దంపతుల తరఫున కేసు వాదించేందుకు ముందుకొచ్చిన రిటైర్డ్ జడ్జిపై అధికార పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని వాడిన పదజాలం వింటే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక రౌడీల రాజ్యంలో ఉన్నామా.. అనే అనుమానం కలగక మానదు. జడ్జిలకు, న్యాయవాదులకు రక్షణ లేకపోతే, ఇక సామాన్య పౌరుడి గతి ఏమిటనే ప్రశ్న ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు భూ కబ్జాలు చేస్తూ, మరోవైపు అడ్డు వచ్చిన వారిని బెదిరించడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ప్రజల ఆస్తులనే దోచుకుంటూ, ప్రశ్నించిన వారిని బెదిరించడం బాబు పాలనలోని నియంతృత్వ ధోరణిని సూచిస్తోందని న్యాయవర్గాలు అంటున్నాయి.
న్యాయ వ్యవస్థను కించపరచడమే
పులివర్తి నాని అసభ్యకర దూషణలు, బెదిరింపులు న్యాయ వ్యవస్థను కించపరచడమే. ఇది కోర్టు ధిక్కారం కూడా. రిటైర్డ్ జడ్జిని తిట్టినా, పదవిలో ఉన్న జడ్జిని తిట్టినా.. అది క్షమించరాని నేరం. హైకోర్టు దీనిపై సుమోటోగా చర్యలు చేపట్టాలి. రిటైర్డ్ జడ్జికి రక్షణ కల్పించాలి.
– జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇంత అసహనమా?
ఎమ్మెల్యే పులివర్తి నాని చర్యలు ముమ్మాటికీ న్యాయ వ్యవస్థను కించపరిచేవే. జడ్జిగా గౌరవప్రద బాధ్యతలు నిర్వర్తించి, పదవీ విరమణ చేసిన తర్వాత న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ.. బాధితులకు అండగా నిలవడం తప్పా? అలాంటి వ్యక్తిని దూషించడం, బెదిరించడం అధికార దురంహకారానికి పరాకాష్ట. ఇది అధికార పార్టీ నేతల నిజ స్వరూపాన్ని సూచిస్తోంది. నానిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.
– ఎస్.శరత్ కుమార్, సీనియర్ న్యాయవాది



