వరంగల్‌ కమిషనరేట్‌కు తొలి మహిళా సీపీగా శ్వేత | N Swetha Appointed As First Woman Police Commissioner Of Warangal, More Details Inside | Sakshi
Sakshi News home page

వరంగల్‌ కమిషనరేట్‌కు తొలి మహిళా సీపీగా శ్వేత

Jun 30 2026 11:09 AM | Updated on Jun 30 2026 11:57 AM

N Swetha Appointed As Warangal New Police Commissioner

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ పోలీసు కమిషనర్‌గా ఎన్‌.శ్వేత నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ నార్త్‌ రేంజ్‌ జాయింట్‌ కమిషనర్‌ (లాఅండ్‌ఆర్డర్‌)గా ఉన్న ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వరంగల్‌ సీపీగా పనిచేసిన సన్‌ప్రీత్‌ సింగ్‌ను సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ విభాగానికి జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. శ్వేత తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా ఎస్పీ, డీసీపీగా çపలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. వరంగల్‌ సీపీ బాధ్యతలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జోన్‌–4 డీఐజీగా కూడా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

తొలి మహిళ కమిషనర్‌..
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటివరకు అంతా పురుషులే సీపీగా నియమితులయ్యారు. శ్వేత వరంగల్‌ కమిషనరేట్‌కు నియమితులైన తొలి మహిళా పోలీస్‌ కమిషనర్‌. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (బీఈ) పూర్తి చేసిన ఆమె ఆ తరువాత సివిల్స్‌ రాశారు. 2012 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె.. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత, నూతనంగా ఏర్పడిన కామారెడ్డి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ మహిళల భద్రత కోసం ప్రతి డివిజన్‌లో ప్రత్యేకంగా ’షీ టీమ్స్‌’ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు. మహిళలకు డ్రైవింగ్, ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇప్పించారు, హైదరాబాద్‌ ఉత్తర మండల డీసీపీగా పనిచేశారు. 2021లో సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌గా నియమితులై కమిషనరేట్‌కు తొలి మహిళా కమిషనర్‌గా సరికొత్త రికార్డు సృష్టించారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో, ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించే వినూత్న సర్వే విధానాలను ప్రవేశపెట్టడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

16 మాసాలకే సన్‌ప్రీత్‌ సింగ్‌ బదిలీ
ఇప్పటివరకు పనిచేసిన సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ సుమారు 16 మాసాల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. ఆయన 2025, మార్చి 8న ఆయన వరంగల్‌ కమిషనరేట్‌కు సీపీగా వచ్చారు. ఆయనకు శాంతిభద్రతల విషయంలో ఎక్కడా తగ్గలేదన్న పేరుంది. బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో ఒక్కరిద్దరు ప్రజాప్రతినిధుల లేఖల సిఫార్సులు పట్టించుకోలేదని, వారడిగిన ఇన్‌స్పెక్టర్‌లకు పోస్టింగ్‌ ఇవ్వలేదన్న ప్రచారం ఉంది. శాంతిభద్రతలు, నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యల విషయంలో ఎక్కడా రాజీపడలేదని ఆశాఖ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయలేదని ఫోన్‌లో పరస్పరం గొడవ పడ్డారన్న ప్రచారం ఉంది.

క్రైమ్స్‌ డీసీపీగా కిషన్‌ సింగ్‌... 
ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ క్రైం డీసీపీగా డి.కిషన్‌ సింగ్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన టీజీ–ఐసీసీసీ టెక్నికల్‌ విభాగంలో నాన్‌ కేడర్‌ ఎస్పీగా ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement