
ఇందులో ఎలాంటి గందరగోళం లేదు
రేవంత్రెడ్డి అర్ధరాత్రి కూడా రాహుల్ను కలవగలరు
శిశుపాలుడిలా కేసీఆర్ తప్పులు 99కి చేరాయి
ఇంకా ఒక్క తప్పు మాత్రమే మిగిలి ఉంది
కాళేశ్వరం విషయంలో ఎంత పెద్దవారున్నా వదలం
ఆగస్టు 15లోగా ధరణి భూబకాసురుల చిట్టా తేలుస్తాం
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చిట్చాట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ దఫా పూర్తికాలం రేవంత్రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని, ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్కు రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని.. కాంగ్రెస్ సీఎంలతో రాహుల్ నిత్యం హాట్లైన్లో అందుబాటులోనే ఉంటారని చెప్పారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘సీఎంకు రాహుల్గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని కొందరంటున్నారు.
కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల రాహుల్గాం«దీని రేవంత్ కలవలేకపోవచ్చు. అంతమాత్రాన కొంపలేం అంటుకుపోవు. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఈ అంశానికి కలర్ పూయాల్సిన అవసరం లేదు. రాహుల్గాం«దీని అర్ధరాత్రి అయినా రేవంత్రెడ్డి కలవగలరు. అయినా, సీఎంలు, పీసీసీ అధ్యక్షులతో రాహుల్గాంధీ హాట్లైన్లో మాట్లాడుతుంటారు’అని చెప్పారు.
తప్పుచేసి దొరికినా దబాయింపా?
కాళేశ్వరం విషయంలో అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని పొంగులేటి విమర్శించారు. తాము తలుచుకుంటే కేసీఆర్ను మొదటి ముద్దాయిగా ఎప్పుడో విచారణకు పిలిపించేవారమని అన్నారు. తప్పు చేసి రెడ్హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా దబాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఒక్క తప్పు చేస్తే వెంటనే శిక్ష వేయవచ్చని, కానీ కేసీఆర్ తప్పులు శిశుపాలుడి తరహాలో 99 వరకు వచ్చాయని.. ఇంకొక్కటి మాత్రమే మిగిలిందని అన్నారు.
ఎనిమిదో వింతను కట్టానని చెప్పుకునే వ్యక్తి మేడిగడ్డ బరాజ్పై ఓ నివేదిక ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. కమిషన్ ముందుకు వచ్చి తాను శిల్పినని కేసీఆర్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిలో ఎంత పెద్దవారున్నా తీవ్ర కఠిన తీసుకుంటామని స్పష్టం చేశారు.
2.10 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రస్తుత దఫాలోనే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి స్పష్టంచేశారు. ‘ఈ పథకంలో భాగంగా తొలి విడత కింద 2.10 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేశాం. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న గ్రామాల్లో 42 వేల ఇళ్లను మంజూరు చేస్తే, అందులో 24 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. వాటికి రూ.135 కోట్లు చెల్లించాం. ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నాం. 33 గృహాలకు 15 – 20 రోజుల్లో గృహ ప్రవేశాలు జరుగుతాయి. ఇంకా 1.15 లక్షల మంది జాబితాను తయారు చేయాల్సి ఉంది. జూన్10 లోపు అది కూడా పూర్తి చేస్తాం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట్ల 40 శాతం ఇండ్లకు వారి సిఫారసులు తీసుకుంటున్నాం. ఆ సిఫారసులను గెజిటెడ్ అధికారి పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు’అని మంత్రి తెలిపారు.
అసైన్డ్ భూముల్లో పేదలకు పట్టాలు
భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నాలుగు మండలాల్లో ఉన్న 625 ఎకరాల అసైన్డ్ భూముల్లో వ్యవసాయ యోగ్యమైనవాటికి పేదలకు పట్టాలు ఇస్తామని పొంగులేటి చెప్పారు. సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయగానే సాదా బైనామాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే 700 మంది ప్రభుత్వ సర్వేయర్లను నియమిస్తున్నామని వెల్లడించారు. ధరణి పోర్టల్ ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించిన చర్చలు పూర్తికావచ్చాయని, మరో వారంలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులిచ్చి ఆగస్టు 15లోపు భూబకాసురుల చిట్టా తేలుస్తామని చెప్పారు.
కవిత ఎపిసోడ్ టీకప్పులో తుఫాన్లాంటిది
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ టీకప్పులో తుఫాన్ లాంటిదని పొంగులేటి అన్నారు. ‘కొందరు ఆడమంటే మరికొందరు ఆడుతుంటారు. అది కుటుంబ పంచాయితీ. కవిత బీజేపీలోకి వెళ్తారని ఒకరు.. కాంగ్రెస్లోకి వస్తారని మరికొందరు అంటున్నారు. దెయ్యాలు, భూతాలు, దేవుళ్లంటూ మాట్లాడుతున్నారు. దెయ్యాలెవరో కవిత చెప్పొచ్చు కదా?’అని ప్రశ్నించారు. తన ఇంటికి ఈడీ అధికారులెవ్వరూ రాలేదని పొంగులేటి స్పష్టంచేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒకరోజు ముందో.. వెనుకో జరుగుతుందని పేర్కొన్నారు.