సిద్దిపేటలో ఉత్సాహంగా హాఫ్‌ మారథాన్‌  | Minister Harish Rao Participating Half Marathon | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో ఉత్సాహంగా హాఫ్‌ మారథాన్‌ 

Aug 7 2023 3:06 AM | Updated on Aug 7 2023 3:06 AM

Minister Harish Rao Participating Half Marathon - Sakshi

హాఫ్‌ మారథాన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో రంగనాయకసాగర్‌ వేదికగా ఆదివారం జరిగిన హాఫ్‌ మారథాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన రన్నర్స్‌ ఉత్సాహంగా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ ‘సిద్దిపేట అన్నింటిలో మేటి.. నేడు హాఫ్‌ మారథాన్‌లోనూ బెస్ట్‌గా నిలిచింది’అని అన్నారు. అనంతరం విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.

కాగా, దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్‌ రహిత హాఫ్‌ మారథాన్‌ను సిద్దిపేటలో నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ, పురుషుల విభాగంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన రమేశ్‌ చంద్ర ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 10కే రన్‌ మహిళా విభాగంలో ప్రథమ బహుమతి నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వప్న, పురుషుల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సునీల్‌కుమార్‌ సాధించారు.

కాగా, హైదరాబాద్‌ నుంచి 100 కిలోమీటర్లు రన్‌ చేసుకుంటూ వచ్చిన శ్రీకాంత్‌ను, అలాగే హైదరాబాద్‌ నుంచి సైక్లింగ్‌ చేసుకుంటూ వచ్చిన నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి డాక్టర్‌ నాగలక్ష్మిలను మంత్రి సత్కరించారు. 10 కిలోమీటర్ల పరుగులో వరంగల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి పాల్గొని 1.06 గంటల్లో పూర్తి చేశారు. హాఫ్‌ మారథాన్‌ (21.1కిలోమీటర్లు)లో 400 మంది, పది కిలోమీటర్ల రన్‌లో 550, 5 కిలోమీటర్ల రన్‌లో 4వేల మంది పాలుపంచుకున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement