సీఎం, హోంమంత్రిగా రేవంత్రెడ్డి విఫలం.. తక్షణమే రాజీనామా చేయాలి: హరీశ్రావు
రక్తపాతాన్ని కోరుకుంటున్న రేవంత్ ప్రజలు, రైతులకు క్షమాపణ చెప్పాలి
పోలీస్ స్టేషన్లను ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చేశారు
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ’కాళేశ్వరం’ డైవర్షన్ డ్రామాలు
బీఆర్ఎస్ శాసనసభ పక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
సాక్షి, సిద్దిపేట/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్లో పోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురిని కిరాతకంగా చంపేయడం ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమేనని బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి విఫలమయ్యారని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లోనూ కొన్ని వ్యాఖ్యలు పోస్ట్చేశారు.
‘రేవంత్కు షాబాద్ హంతకుడికి తేడా లేదు. రైతులు సాగునీరు అడిగితే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని మాట్లాడిన ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు.ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు మరోసారి దారుణ హత్యాకాండకు పాల్పడ్డాడన్నారు. మే 16న మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు.
అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు.. నెల రోజులపాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలు బయటపడినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాళేశ్వరం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని ఆరోపించారు.
చిన్నారి పేరుపై కోటి డిపాజిట్ చేయాలి
‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు. షాబాద్ ఘటనలో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఈ కిరాతక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన దివ్యాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం రూ.కోటి ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయిని పెంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి’అని హరీశ్రావు చెప్పారు.
ఓదార్పు కోసం వెళ్లిన మాజీ హోంమంత్రి సబిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పద్మలను నేరస్తులుగా అరెస్ట్ చేశారని, అదే హత్య చేసిన నేరస్తున్ని పోలీసులు పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చేమోగానీ, ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదన్న అబ్రహం లింకన్ వ్యాఖ్యలు రేవంత్కు సరిగ్గా సరిపోతాయని హరీశ్ అన్నారు.
రేవంత్ తెచ్చిన కృత్రిమ కరువు
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కృత్రిమ కరువు అని హరీశ్రావు ఆరోపించారు. గోదావరి నదిలో కావలసినన్ని నీళ్లున్నప్పటికీ, కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదని విమర్శించారు. పంట పొలాల్లో గోదావరి నీళ్లు పారేలా రేవంత్రెడ్డికి కలలో వచ్చి చెప్పాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ నాయకులు సాగునీటి కోసం సూచనలు చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తగిన సమయంలో రైతులు, ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హరీశ్రావు హెచ్చరించారు.


