‘పైసా ఖ‌ర్చు లేదు.. విద్యతో పాటు అన్ని ఫ్రీ’ | Mahabubabad govt school students letters to parents for admissions | Sakshi
Sakshi News home page

‘మా బడికి సహకరించండి’

Apr 12 2025 7:05 PM | Updated on Apr 12 2025 7:29 PM

Mahabubabad govt school students letters to parents for admissions

పోస్టుబాక్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉత్తరాలు 

కురవి: ‘మా ప్రభుత్వ బడికి సహకరించండి’ అంటూ విద్యార్థులు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసి పోస్టు చేసిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో జరిగింది. స్థానిక ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం కోసం నూతన విద్యార్థుల నమోదు కోసం తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. 

‘మా ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలున్నాయి. చదువుతోపాటు ఆటలు, చిత్రలేఖనం, జనరల్‌ నాలెడ్జ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో మేం ముందుంటున్నాం. కాబట్టి మీరు పాఠశాల గురించి మన ఇరుగుపొరుగు వారికి తెలియచేసి వారి పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించేలా ప్రోత్సహించండి’ అంటూ ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

పాఠ్యాంశానికి అనుగుణంగా, కనుమరుగైన ఉత్తరాలు, వాటిని రాసే విధానాన్ని, పోస్టాఫీస్‌ విధులు, వాటి వినియోగం గురించి తెలియజేస్తూ పాఠశాల 4, 5వ తరగతుల విద్యార్థులతో ఉత్తరాలు (Letters) రాయించి ప్రచారం చేయించామని హెచ్‌ఎం తేలుకుంట్ల సునీత తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు (Teachers) టి.మమత, వి.జ్యోతి, టి.రామారావు పాల్గొన్నారు.

మెగా జాబ్‌ మేళా.. భారీగా వచ్చిన నిరుద్యోగులు
వరంగల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపాన ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు (Job Mela) భారీ సంఖ్యలో నిరుద్యోగులు హాజరయ్యారు. 65 మల్టీనేషనల్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్న ఈ జాబ్‌ మేళాకు జిల్లావ్యాప్తంగా 18 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. దీంతో ఫంక్షన్‌ హాల్‌ కిక్కిరిసిపోయి తోపులాట జరిగింది. 

ఈ క్రమంలో హాల్‌కు సంబంధించిన కిటికీలు ధ్వంసమయ్యాయి. నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. జాబ్‌ మేళాకు వచ్చిన వారిలో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు కలెక్టర్‌ సత్యశారద పేర్కొన్నారు. కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), సీతక్క, బల్దియా కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు  హాజరయ్యారు.

ఎమ్మెల్యే భక్తి గానలహరి 
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ (Jare Adinarayana) గాయకుడిగా అలరించారు. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడైన ఆయన.. దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో శుక్రవారం పర్యటించారు. అదే సమయంలో రామాలయంలో ప్రత్యేక పూజలకు హాజరైన అయ్యప్ప భక్తులు భజన నిర్వహిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా వారితో చేరి.. ‘పార్వతి తనయా.. గణపతి దేవా’అంటూ వివిధ భక్తిపాటలు పాడి ఆకట్టుకున్నారు.

చ‌ద‌వండి: దొంగతనం చేసిన ఇంటి యజమానినే పట్టించిన సీసీ కెమెరా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement