మహబూబాబాద్ రూరల్ : వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన వరుణయాగంతో వరుణుడి అనుగ్రహం లభిస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. సోమవారంనాగార్జున సాగర్ వద్ద కృష్ణానది తీరంలో వరుణయాగం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద ఎమ్మెల్యే మురళీనాయక్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే మురళీనాయక్ వరుణయాగంలో పాల్గొన్నారు.
సోమేశ్వరస్వామికి అన్నపూజ
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా బహుళ త్రయోదశి పురస్కరించుకొని స్వామివారికి అన్నపూజ నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, అ ర్చనలు, కోడెమొక్కులు చెల్లింకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, ఆర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఈనెల 11, 12 తేదీల్లో టోర్నమెంట్ నిర్వహణకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 11న ఉదయం 10 గంటలకు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి టోర్నమెంట్ను ప్రారంభిస్తారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బ్యాడ్మింటన్, క్రికెట్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు, పురుషులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
49 మందిపై కేసులు
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన జైల్ భరో సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్తో పాటు మరో 24మందిపై కేసులు నమోదు చేశామని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి సోమవారం తెలిపారు. అదే విధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐలయ్యతో పాటు మరో 23మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
టేకు కలప స్వాధీనం
బయ్యారం: మండలంలోని చుంచుబంధంతండాలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.76 వేల విలువైన టేకు కలపను సోమవారం రాత్రి అటవీ అధికారులు పట్టుకున్నారు. అటవీశాఖాధికారి రవికిరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తండాలో టేకు కలప నిల్వ ఉందనే సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించగా.. కలప పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గణపేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా.. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరి నవీన్కుమార్సుమతి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గోశాలలో పని చేస్తున్న పాణిగంటి గణేష్కు రూ.24 వేలు వేతనాన్ని నవీన్కుమార్ దంపతులు అందించారు.


