సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన జైల్భరో కార్యక్రమం ఉద్రిక్తత నడుమ సాగింది. ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనలో పలువురు మహిళలకు గాజులు కోసుక పోగా.. తోపులాటలో మహిళా కానిస్టేబుల్ కింద పడిపోయింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్తో సహా పలువురు నాయకులను అరెస్టు చేసి మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్, కార్పొరేట్ అనుకూల విధానాలను, రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాదాన్ని వ్యతిరేకించేందుకు శ్రామిక ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పోరాడి సాధించుకున్న 29కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్కోడ్లను తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమే అని విమర్శించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రోజు వేతనం రూ. 600చెల్లించాలని, పని దినాలు ఏడాదికి 200 రోజు లకు పెంచాలని, పట్టణాల్లో పథకాన్ని ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సూర్ణం సోమయ్య, బానోత్ సీతారాం నాయక్, సమ్మెట రాజమౌళి, దుడ్డెల రాంమూర్తి, కుమ్మరి కుంట్ల నాగన్న, పట్ల మధు, గుండు సులోచన, కంపల్లి శ్రీనివాస్, కందునురి కవిత, యమగాని వెంకన్న, గారే కోటేశ్వరావు, చంగంటి భాగ్యమ్మ పాల్గొన్నారు.
పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట
పలువురు నాయకుల అరెస్టు
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బీజేపీపై పోరు
సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్


