డామిట్‌ కథ అడ్డం తిరిగింది.. | Thief Caught On Camera in Sircilla | Sakshi
Sakshi News home page

కిలాడి బండారం బ‌ట్ట‌బ‌య‌లు

Apr 12 2025 5:23 PM | Updated on Apr 12 2025 5:51 PM

Thief Caught On Camera in Sircilla

దొంగతనం చేసిన ఇంటి యజమానినే పట్టించిన సీసీ కెమెరా

సిరిసిల్ల క్రైం: డామిట్‌ కథ అడ్డం తిరిగింది.. అవును రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజంగా కథ అడ్డం తిరిగింది. ఇంటి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా యజమాని దొంగతనం చేయగా పట్టించింది. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని చంద్రంపేటలో రాజవ్వ అనే వృద్ధురాలు గురువారం రాత్రి తన కూతురుతో ఇంట్లో నిద్రిస్తోంది. అదే గ్రామానికి చెందిన శేఖర్‌ వృద్ధురాలి మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.

మేల్కొన్న వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి దొంగ కోసం గాలించారు. ఇంతలోనే దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి జనంతో కలిసిపో యి వెతికినట్లు నటించి బంగారు గొలుసు దొరికిందని అందరినీ నమ్మించాడు. అసలు దొంగను పట్టుకోవాలని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు శేఖర్‌ ఇంటికి ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ (CCTV Footage) పరిశీలించి అవాక్కయ్యారు. దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి గొలుసు దొరికినట్లుగా నాటకమాడాడని గుర్తించారు.  

తండ్రి మందలించాడని..
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతోపాటు తమ కుటుంబంతో సత్సంబంధాలు లేని వ్యక్తులతో మాట్లాడటం నచ్చని తండ్రి మందలించగా.. కోపోద్రిక్తుడైన కొడుకు కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా.. కొడుకు పరారీలో ఉన్నాడు. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రమాకాంత్‌ వివరాలు వెల్లడించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒడ్డెరకాలనీకి చెందిన కుంచెపు కనకయ్య (50)కు కుమారుడు కుంచెపు పర్శరాములు ఉన్నాడు. వీరి ఇంటి సమీపంలోనే ఓ శుభకార్యం జరిగింది. ఆ శుభకార్యం జరిగిన కుటుంబంతో కనకయ్య కుటుంబానికి మాటలు లేకపోయినా.. పర్శరాములు వెళ్లాడు. దీంతో వారికి మనకు మాటల్లేవని, ఎందుకు వెళ్లావని తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. పనిపాటా లేకుండా తిరుగుతున్నావని మందలించాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కొడుకు కర్రతో తండ్రి కనకయ్యపై దాడి చేశాడు. బలమైన దెబ్బ తగలడంతో మెడ నరాలు చిట్లిపోయి, అక్కడే కుప్పకూలిన కనకయ్యను కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. కాగా, నిందితుడు పర్శరాములు గతంలో కరెంట్‌షాక్‌లు పెడుతూ చేపలు పడుతూ దొరకడంతో పోలీసులు రెండుసార్లు కేసులు నమోదు చేశారు. కొంతకాలం జైలులో ఉండి బయటకొచ్చాడు. పర్శరాములుపై హత్య కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చ‌ద‌వండి: వార్నీ.. ఎయిర్‌పోర్టును కూడా వ‌ద‌ల‌రా?

Advertisement
 
Advertisement
Advertisement