తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం | Legal aid for Telugu students | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం

Jun 4 2025 1:13 AM | Updated on Jun 4 2025 5:54 AM

Legal aid for Telugu students

బీఆర్‌ఎస్‌ తరఫున అండగాఉంటామన్న కేటీఆర్‌...

అమెరికా చట్టాలపై అవగాహనతో మసలుకోవాలని సూచన 

యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌– డాలస్‌ విద్యార్థులతో భేటీ... డాలస్‌లో ఐటీ కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశం 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలుస్తామని భారత్‌ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన విద్యార్థులు స్థానిక చట్టాలపై అవగాహన లేకుండా ఏవైనా తప్పులు చేస్తే వారికి బీఆర్‌ఎస్‌ అమెరికా విభాగం తరఫున న్యాయ సహాయం చేస్తామని చెప్పారు. 

అమెరికాకు వర్థిన విద్యార్థులు ఏదైనా కారణంతో స్వదేశానికి తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో ఆవేదనకు గురవుతుందని, ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు బీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులు కూడా స్థానిక చట్టాలతో పాటు అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసలుకోవాలని సూచించారు. 

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌– డాలస్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో కేటీఆర్‌ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గతంలో భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు, చదువు కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారని కేటీఆర్‌ గుర్తు చేశారు. 

వేగంగా మారిన ప్రపంచ పరిణామాలతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో అమెరికాలో అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. ర్యాంకులు, గ్రేడ్ల కోసం కాకుండా జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. 

అధికారంలోకి వచ్చాక ఐటీ మరింత అభివృద్ధి  
మంగళవారం డాలస్‌లో అక్కడి ఐటీ కంపెనీల యాజ మాన్య ప్రతినిధులతో కూడా కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఐటీ రంగంలో తెచ్చిన విప్లవాత్మక విధానాల వల్లే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఏఐ రంగంలో దేశ యువత పోటీ పడగలుగుతుందన్నారు. 

అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు భారత్‌లో ఖండాంతర సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశముందని చెప్పారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ రంగంవిస్తరించి ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్‌ వంటి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు నిర్మించామని తెలిపారు. అమెరికాలోని యువత భారత్‌లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు.  

కేసీఆర్‌ జీవితం స్ఫూర్తిగా... 
సాహసోపేత నిర్ణయాల ద్వారానే కలలు సాకారం అవుతాయనేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జీవితమే సాక్ష్యమని కేటీఆర్‌ అన్నారు. నలభై ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అవహేళనలు ఎదురైనా 14 ఏళ్లు నిరంతర పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారని చెప్పారు. 

అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి భారత్‌కు వచ్చి కంపెనీలు ప్రారంభించాలని, ఆవిష్కరణల యుగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. భారత్‌లో సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. మేధో వలస భారత్‌కు పెను సవాలుగా మారిందంటూ, ప్రవాస భారతీయ విద్యార్థులు దేశ, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement