సౌర విద్యుత్‌పై కొరవడిన ఆసక్తి | Lack of interest in solar power | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌పై కొరవడిన ఆసక్తి

Jun 30 2025 3:14 AM | Updated on Jun 30 2025 3:14 AM

Lack of interest in solar power

దరఖాస్తులు చేసినప్పటి ఉత్సాహం.. పీపీఏ నాటికి తగ్గిన వైనం వేలల్లో దరఖాస్తులు.. వందల్లో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు 

టీజీ ఎన్పీడీసీఎల్‌లో 2,098 దరఖాస్తులు 

పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నది 133 మంది మాత్రమే.. 

టీజీ ఎస్‌పీడీసీఎల్‌లో 2,265 దరఖాస్తులు.. పవర్‌ పర్చేజ్‌ చేసుకున్నది 163 మంది 

హనుమకొండ: సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇందుకు.. వచ్చిన దరఖాస్తులు, చేసుకున్న పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లే నిదర్శనం. వేలల్లో దరఖాస్తులు రాగా, వందలో మాత్రమే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు జరగడాన్ని బట్టీ.. సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై రైతుల్లో ఉత్సాహం సన్నగిల్లిందని అర్థమవుతోంది.

భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కాని ధర.. 12 ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావచ్చన్న ఆలోచన.. రుణాలపై స్పష్టత లేకపోవడం, రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడం.. ప్రతీనెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి.. సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తులు చేసినప్పటి ఉత్సాహం.. ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ చేసుకోవడంలో లేదు.  

లక్ష్యం ఘనం.. స్పందన గగనం..
కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్లాంట్‌ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్‌ మహాభియాన్‌ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచి్చంది. ప్రధానంగా రైతులను సౌర విద్యుదుత్పత్తి వైపు ప్రోత్సహించడం దీని ఉద్దేశం. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్‌పీడీసీఎల్‌ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. 

రైతులతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. సౌర విద్యుదుత్పత్తి చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్‌ ధరలకు కొనుగోలు చేస్తాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేయి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మెగావాట్ల ఉత్పత్తి కోసం.. రైతులతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నదే పథకం లక్ష్యం. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ మేరకు రైతులనుంచి స్పందన కనిపించకపోవడంతో లక్ష్యం నీరుగారేలా ఉంది.

మందకొడిగా పథకం ప్రక్రియ.. 
పథకం రూపకల్పన, ఆదాయం వచ్చే మార్గాలపై ఉన్న సందేహాలతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ వరకు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.

టీజీ ఎన్పీడీసీఎల్‌లో..
టీజీ ఎన్పీడీసీఎల్‌లో 2,098 మంది రైతులు 2,788.900 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 439 మందికి 561.7 మెగావాట్లకు లెటర్‌ ఆఫ్‌ ఆక్సెపె్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 133 మంది రైతులు 161 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మాత్రమే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. దరఖాస్తులు వేలల్లో వస్తే పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ వందలో మాత్రమే చేసుకున్నారు.

మొదటినుంచీ రైతుల అనాసక్తి..  
మొదటినుంచి సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై రైతులు ఆసక్తి కనబరచడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఈఎండీలు చెల్లించడానికి రెండుసార్లు గడువు విధించారు. అయినా దరఖాస్తులు వచి్చన మేరకు.. ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రాలేదు. ఈఎండీలు చెల్లించిన మేరకు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ చేసుకునేందుకు రైతులు ముఖం చాటేస్తున్నారు. ఒక మెగావాట్‌ సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు రూ.3 కోట్లు ఖర్చవుతుంది. 

ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. రుణ విషయంలో బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పడం లేదని రైతులు తెలిపారు. సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకునేంత భారీ పెట్టుబడి రైతులుగా తాము వెచ్చించలేమని చెబుతున్నారు. 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, దీనికి తోడు తమ స్థలం నుంచి సబ్‌స్టేషన్‌ వరకు అయ్యే ఖర్చులు భరించలేమని, ప్రభుత్వం యూనిట్‌కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఎటూ సరిపోవన్నారు. 

విద్యుదుత్పత్తి కూడా అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండకపోవచ్చని, దీంతో వచ్చిన ఆదాయంలో నిలకడ లోపిస్తుందని, దీంతో నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. పన్నెండేళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో.. అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోతున్నారు. 

పన్నెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని, అదే విధంగా 25 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.13 మాత్రమే చెల్లించడం ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్నారు. రాయితీ లేకపోవడంతో తమపై దారుణమైన భారం పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

టీజీ ఎస్‌పీడీసీఎల్‌లో.. 
టీజీ ఎస్‌పీడీసీఎల్‌లో 2265 మంది రైతులు 3,369.500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 682 మంది రైతులు 1035.5 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. ఇందులో 560 మంది రైతులకు 850.8 లెటర్‌ ఆఫ్‌ ఆక్సెప్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 163 మంది రైతులు 225 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు డిస్కంతో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement