రేవంత్‌ సర్కార్‌పై దర్యాప్తు ఎందుకు చేయించడం లేదు? | KTR Shocking Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ సర్కార్‌పై దర్యాప్తు ఎందుకు చేయించడం లేదు?

Jun 30 2025 5:45 AM | Updated on Jun 30 2025 5:45 AM

KTR Shocking Comments On Revanth Reddy

ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభిస్తారు?

కేంద్ర మంత్రి అమిత్‌షాని ఎక్స్‌లో ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, సీబీఐ, ఈడీలతో వెంటనే విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పేరిట రాహుల్‌–రేవంత్‌ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన ప్రధాని మోదీ, ఇప్పటి వరకు దర్యాప్తునకు ఆదేశించకపోవడానికి కారణమేంటో చెప్పాలన్నారు. దేశ ప్రధాని హోదాలో మోదీ, కేంద్ర హోంమంత్రిగా అమిత్‌ షా తెలంగాణకు వచ్చి సీఎంపై కేవలం అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా అని కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు తెలంగాణలోని రేవంత్‌ సర్కార్‌ ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్‌ గడ్డపై తేల్చిచెప్పిన అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి హోదాలో విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాల న్నారు. ధాన్యం దిగుబడిలో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై అమిత్‌షా బురద జల్లడం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా, ఆఫీసుకు రిబ్బన్‌ కట్‌ చేస్తే నయాపైసా ప్రయోజనం ఉండదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

పసుపు బోర్డు కార్యాలయా నికి సొంత భవనం నిర్మించకుండా కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటు చేస్తున్నామని ఈ జనవరి 14న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తే, ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని మరోసారి అమిత్‌ షా ప్రారంభించడం బీజేపీ చేసే జుమ్లా పనులకు, చెప్పే జూఠా మాటలకు నిదర్శనం అని కేటీఆర్‌ విమర్శించారు. నదుల అనుసంధానం ముసుగులో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు కేంద్రం బంగారు బాటలు వేయడం గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడమే అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement