శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

Published Wed, Oct 4 2023 12:01 PM

KTR Nirmal district Tour: ASHA Workers Protest At Gundampally - Sakshi

సాక్షి, నిర్మల్‌ జిల్లా: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపెల్లిల వద్ద శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌తో నిర్మించిన కాళేశ్వర ప్రజెక్టు ప్యాకేజీ-27ను (శ్రీలక్ష్మీ నరసింహాస్వామి లిఫ్ట్‌ ఇరిగేషన్‌) మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఎత్తిపోతల పథకానికి స్విచ్‌ ఆన్‌ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తరువాత దిలావర్‌పూర్‌ శివారులోని డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించి పూజ నిర్వహించారు. అదే విధంగా సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఆశా కార్యకర్తల ఆందోళన.. గుండంపెల్లిలో ఉద్రిక్తత
గుండంపెల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకం పంప్‌ హౌస్‌ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ ఆశా కార్యకర్త సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసుల తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. 

చివరికి ప్యాకేజీ 28 కాళేశ్వర పనులు ప్రారంభించిన తర్వాత మంత్రికి ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్‌ భరోసానిచ్చారు. 

Advertisement
Advertisement