రైలు ప్ర‌మాదాల‌కు చెక్‌.. కవచ్‌ 4.0 ట్రయల్స్‌ షురూ | Kavach trial run south central railway details | Sakshi
Sakshi News home page

Kavach Trial: కవచ్‌ 4.0 వెర్షన్‌ ట్రయల్స్‌ షురూ

Jun 24 2025 5:12 PM | Updated on Jun 24 2025 5:33 PM

Kavach trial run south central railway details

మళ్లీ దక్షిణ మధ్య రైల్వే పరిధి ప్రాంతాలే ఎంపిక

రఘునాథ్‌పల్లి–మౌలాలీ, సనత్‌నగర్‌–వికారాబాద్‌ సెక్షన్లలో ట్రయల్స్‌ 

వాటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు 

జోన్‌ పరిధిలో 4,655 రూట్‌ కి.మీ.లో ఏర్పాటుకు అనుమతి 

సాక్షి, హైదరాబాద్‌: పరస్పరం రైళ్లు ఢీకొనకుండా నిరోధించేందుకు సాంత పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రైల్వే రూపొందించిన కవచ్‌ సాంకేతిక తదుపరి వెర్షన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కవచ్‌ 3.2 వెర్షన్‌ ఉండగా, ఇటీవల 4.0 వెర్షన్‌ను రూపొందించారు. రైల్వే అనుబంధ సంస్థ రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎస్‌ఓ) అభివృద్ధి చేసిన ఈ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ ట్రయల్స్‌కూ దక్షిణ మధ్య రైల్వే పరిధినే ఎంపిక చేయటం విశేషం. సనత్‌నగర్‌–వికారాబాద్‌–వాడీ సెక్షన్‌ను కవచ్‌ 3.2 వెర్షన్‌ ప్రయోగాలు, ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, ఇప్పుడు ఆధునిక వెర్షన్‌ కోసం సనత్‌నగర్‌–వికారాబాద్, రఘునాథ్‌పల్లి–మౌలాలీ సెక్షన్‌లను ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్‌ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే (south central railway) జోన్‌ పరిధిలో 6,600 రూట్‌ కి.మీ.కు గాను 4,655 కి.మీ.లలో కవచ్‌ 4.0 ఏర్పాటుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే జోన్‌ పరిధిలో 1465 కి.మీ. మేర కవచ్‌ 3.2 వెర్షన్‌ ఏర్పాటై ఉంది. ఇప్పుడు దీన్ని కొత్త వెర్షన్‌తో అప్‌గ్రేడ్‌ చేయటంతోపాటు మిగతా ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. 4.0 వెర్షన్‌ ప్రయోగాల కోసం ఎంపిక చేసిన సనత్‌నగర్‌–వికారాబాద్‌ సెక్షన్‌లో 63 కి.మీ. మేర పాత వెర్షన్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ పరిధిలో కొత్త వెర్షన్‌ ట్రయల్స్‌ మొదలయ్యాయి. రఘునాథ్‌పల్లి– మౌలాలీ సెక్షన్‌ పరిధిలో పాత వెర్షన్‌ లేదు. ఇప్పుడు ఈ సెక్షన్‌ పరిధిలోని 86 కి.మీ.లో కొత్త వెర్షన్‌ ఏర్పాటు చేసి ట్రయల్స్‌ ప్రారంభించారు.

కొత్త వెర్షన్‌ సరే.. ఈ జాప్యమేంటి? 
కవచ్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పుష్కర కాలంగా కవచ్‌ వ్యవస్థపై ట్రయల్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రయోగాల కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏర్పాటు చేసిన 1,465 కి.మీ. తప్ప దేశంలో మిగతా చోట్ల దీన్ని ఏర్పాటు చేయలేదు. ఈలోపు కవచ్‌ 4.0 (Kavach 4.0) ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ ప్రయోగాలు, ట్రయల్స్‌తో మళ్లీ జాప్యం తప్పేలా కనిపించటం లేదు. కవచ్‌ 4.0 వెర్షన్‌ కోసం బల్లార్షా – కాజీపేట – విజయవాడ, విజయవాడ – గూడూరు, విజయవాడ – దువ్వాడ, వాడి–గుంతకల్‌–ఎర్రగుంట్ల–రేణిగుంట (Renigunta) సెక్షన్లకు సంబంధించి 1,618 కి.మీ.కు టెండర్లు పిలిచారు.

కొత్త వెర్షన్‌లో రైలును మరింత వేగంగా, తక్కువ నిడివిలో సురక్షితంగా బ్రేక్‌ వేసి ఆపే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పాత దానిలో సంప్రదాయ సిగ్నలింగ్‌ వ్యవస్థ ఉండగా, కొత్త దాంట్లో ఇంటెలిజెంట్, డైనమిక్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ వాడుతున్నారు. 4.0లో గ్రాఫికల్‌ ఇంటర్‌ఫేస్‌తో, డ్రైవర్‌కు క్లియర్‌ విజువల్, అథెంటికేటెడ్‌ అలర్ట్స్‌ ఇవ్వగలదు. దీన్ని హ్యాక్‌ చేయటం అంత సులువు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వినియోగంలో ఉన్న యాంటీ కొలిజన్‌ సిస్టమ్స్‌ సరసన నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్‌ బూమ్‌- 1,48 గ‌జాలు.. రూ.33 కోట్లు   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement