
గచ్చిబౌలిలో హౌసింగ్ బోర్డుకు చెందిన వాణిజ్య స్థలానికి వేలంలో భారీ ధర
మొత్తం 11 ప్లాట్ల విక్రయంతో బోర్డుకు రూ. 65 కోట్ల ఆదాయం
కూకట్పల్లి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన 11 స్థలాలు సోమవారం బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయ్యాయి. మొత్తంగా బోర్డుకు రూ. 65.02 కోట్ల ఆదాయాన్ని అందించాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని 1,487 గజాల ఒక వాణిజ్య స్థలం ఏకంగా రూ. 33 కోట్లు పలికింది. చదరపు గజానికి రూ. 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించగా వేలంపాటలో అది ఏకంగా రూ. 2.22 లక్షలు పలికింది. అలాగే అదే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 1,206 గజాల స్థలం వేలంలో రూ. 13.51 కోట్లు పలికింది. అక్కడ చదరపు గజానికి రూ. 80 వేలను ఆఫ్ సెట్ ధరగా ఖరారు చేయగా వేలంలో గజం రూ. 1.12 లక్షలకు అమ్ముడుపోయింది.

చింతల్లో నాలుగు స్థలాలు, నిజాంపేటలో నాలుగు ఫ్లాట్లు సైతం ఈ వేలంపాటలో అమ్ముడయ్యాయి. ఒక్క గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతానికి సంబంధించిన భూముల వేలం ద్వారానే రూ. 55.56 కోట్ల మేర ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది. చింతల్లోని ప్లాట్ నెం.113, 114, 115 ద్వారా సుమారు రూ. 8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కేపీహెచ్బీ (KPHB) కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేలంలో 55 మంది పాల్గొన్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతం ఓ ప్రకటన విడుదల చేశారు.

రెరా ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ ఎ.సంతోష్రెడ్డి బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుగు సంతోష్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సభ్యులతో కలసి ట్రిబ్యునల్ కార్యకలాపాలు నిర్వహించారు. జస్టిస్ సంతోష్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: ల్యాండ్యూజ్ సర్టిఫికెట్ల జారీ.. ఇక ఈజీ