సమర్థవంతంగా జువెనైల్‌ జస్టిస్‌  | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా జువెనైల్‌ జస్టిస్‌ 

Published Tue, Aug 15 2023 1:35 AM

Justice Shyam Kosi launched the Juvenile Justice Awareness Program - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం జువెనైల్‌ జస్టిస్‌ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్‌ పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌ కోషి పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి అభివృద్ధే సమాజ ప్రగతి అన్నారు. లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ, జ్యుడీషియల్‌ అకాడమీ సంయుక్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జువెనైల్‌ జస్టిస్‌పై రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌ కోషి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ అధ్యక్షుడు, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జ్యువెనైల్‌ జస్టిస్‌ బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ శ్యామ్‌ కోషి మాట్లాడారు. పాఠశాలల్లో, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ ఉద్ఘాటించారు. బాల నేరస్తులను సంస్కరించడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను చట్టంలో పొందుపరిచారని జస్టిస్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

జువెనైల్‌కు న్యాయ సేవలను అందించడంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ మెంబర్‌ సెక్రటరీ ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి వివరించారు. జువెనైల్‌ జస్టిస్‌ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement