
విదేశాల్లో అదృశ్యమవుతున్న భారతీయులు
వారిలో బతుకుదెరువుకు గల్ఫ్కి వెళ్లినవారే అధికం
ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆవేదన
ఉన్నారో లేరో.. వస్తారో రారోనని నరకయాతన
కుటుంబ పెద్ద లేక, ఆర్థిక సమస్యలతో సతమతం
ఏనాటికైనా తిరిగి వస్తారన్న నమ్మకంతో ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కంటికి రెప్పలే భద్రత. ఆ కనురెప్పలే మాయమైతే కళ్ల పరిస్థితేంటి? అలాగే కంటికి రెప్పలాంటి ఇంటిపెద్ద దేశంకాని దేశంలో ఉన్నట్టుండి కనిపించకుండా పోతే.. ఇక్కడి ఆ కుటుంబం పరిస్థితేంటి? కట్టుకున్నవాడి కోసం ఆ ఇల్లాలు పడే ఆవేదన మాటలకు అందదు.. అమ్మా.. నాన్న ఎక్కడ అని పిల్లలు అడిగినప్పుడల్లా ఆ తల్లి గుండె ముక్కలయ్యే శబ్దం ఆమెకు మాత్రమే వినిపిస్తుంది.
బతుకుదెరువు కోసం అప్పులు చేసి, సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నవారిలో కొందరు కనిపించకుండా పోతుండటంతో వారి కుటుంబాలు తీరని శోకంలో మునిగిపోతున్నాయి. ఆర్థిక ఆసరా ఆగిపోయి జీవితాలు తలకిందులవుతున్నాయి. విదేశాల్లో ఆచూకీ లేకుండా పోయిన కొందరు కార్మికుల కుటుంబ సభ్యులను ‘సాక్షి’ కదిలించే ప్రయత్నం చేసింది.
నాలుగేళ్లుగా నరకయాతన
ఈమె పేరు సింగం లక్ష్మి. ఈమె భర్త సింగం రాజేశ్వర్ గౌడ్ సౌదీఅరేబియాలో నాలుగేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి తన భర్త ఆచూకీ తెలపాలని నాయకులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ లక్ష్మి అలుపెరుగక తిరుగుతూనే ఉంది. ఖానాపూర్కు చెందిన సింగం రాజేశ్వర్ గౌడ్ 2018లో సౌదీ వెళ్లి.. రియాద్ సిటీ ఆమ్రియాలో ఖర్జూర తోట పని చేసేవాడు. తరచూ భార్య, పిల్లలతో ఫోన్లో మాట్లాడేవాడు.
2021 సెపె్టంబర్ 12 నుంచి అతని నుంచి ఫోన్లు రావడం నిలిచిపోయింది. అప్పటి నుంచి రాజేశ్వర్ ఆచూకీ లేకుండా పోయాడు. అతడితో కలిసి రూమ్లో ఉండేవారిని ఆరా తీయగా నాలుగు నెలల జీతంతో ఇంటికి డబ్బులు వేస్తానని వెళ్లి, తిరిగి రాలేదని తెలిపారు. దీంతో అక్కడి భారత ఎంబసీ, గల్ఫ్ కారి్మక సంఘాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులను కలసి రాజేశ్వర్ గౌడ్ ఆచూకీ కనుక్కోవాలని లక్ష్మి వినతులు ఇస్తూనే ఉంది.
కట్టుకున్న భర్త కనిపించకపోవటం, కుటుంబ భారం మొత్తం ఆమెపైనే పడటం, పైగా రూ.7 లక్షల వరకు అప్పు కూడా ఉండటంతో ప్రస్తుతం కూలిపని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు సిద్దార్థ డిగ్రీ పూర్తిచేసి మూడు నెలలక్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. కూతురు మౌనిక డిగ్రీ పూర్తిచేసింది. చిన్న కొడుకు మల్లిఖార్జున్ పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటికైనా రాజేశ్వర్ ఆచూకీ దొరుకుతుందేమోనని ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.
నాన్న ఏడని అడుగుతున్నారు?
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందినలాస్యకు ఇద్దరు కూతుళ్లు. ప్రస్తుతం గర్భవతి కూడా. ఈమె భర్త బట్టు నాగార్జున్ జగిత్యాలలోని సీఎమ్మార్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా గత మే 5న దుబాయ్కి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో లాస్య తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. తండ్రి నుంచి నెల రోజులుగా ఫోన్ రాకపోవడంతో పిల్లలు.. నాన్న ఏడి? అని అడుగుతన్న ప్రతిసారీ లాస్య గుండె తరుక్కుపోతోంది.
భర్త ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో అని తలచుకుని రోజూ విలపిస్తోంది. నాగార్జున్ ఆచూకీ తెలపాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డికి మెయిల్ ద్వారా విన్నవించింది. ట్రావెల్స్ వాళ్లు పట్టించుకోవడం లేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన భర్తను క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతోంది.
సింగపూర్లో మతి స్థిమితం కోల్పోయి..!
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన గుండ్ల భూమేశ్వర్ మే 13న సింగపూర్ వెళ్లాడు. 19న అందరితో పాటే బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. అతడిని పనిలో పెట్టుకున్నవారు భూమేశ్వర్ను వెతికి పట్టుకొని మెట్రో ట్రైన్లో రూమ్కు తిరిగి తీసుకొస్తుండగా మధ్యలో ఒక స్టేషన్ వద్ద దిగిపోయాడు. తర్వాత ఎంత వెతికినా దొరకలేదు. అతడి ఫోన్ కూడా పనిచేయడం లేదు.
భూమేశ్వర్ మతి స్థిమితం కోల్పోయినట్టుందని అనుమానిస్తున్నారు. ఎలాగైనా ఆయనను ఇంటికి రప్పించేలా సింగపూర్ అధికారులు, అక్కడి భారత ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల ‘ప్రవాసీ ప్రజావాణి’లోనూ భూమేశ్వర్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.
31 ఏళ్లుగా కానరాని ఆచూకీ..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన ఈమె పేరు భోగ లక్షి్మ. ఈమె భర్త సదానందం 1994లో టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లభించలేదు. సదానందం దుబాయ్ వెళ్లిన సమయంలో లక్షి్మకి ఐదేళ్లలోపు బాబు, పాప ఉన్నారు. సదానందం ఆచూకీ కోసం అధికారులు, నాయకులను ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమే సంసార బాధ్యతలు భుజానికెత్తుకుని బీడీ కార్మికురాలిగా మారి పిల్లలను చదివించి పెళ్లిళ్లు చేసింది. 31 ఏళ్లుగా భర్త ఆచూకీ కోసం వెదుకుతూనే ఉంది. ఏనాటికైనా సదానందం తిరిగి వస్తాడన్న ఆశతో లక్ష్మి బతుకుతోంది.
ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించవచ్చు
విదేశాలలో తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొనడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ’ప్రవాసీ ప్రజావాణి’లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవాసీల కుటుంబ సభ్యులకు, భారత విదేశాంగ శాఖకు, విదేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు ’ప్రవాసీ ప్రజావాణి’ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. బాధితులు నేరుగా భారత రాయబార కార్యాలయాలకు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. ’మదద్’పోర్టల్లో మిస్సింగ్ ఫిర్యాదు కూడా నమోదు చేయవచ్చు. – మందా భీంరెడ్డి, వైస్ చైర్మన్, స్టేట్ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ, తెలంగాణ ప్రభుత్వం